జయహో.. మహిళ.. మహిళా బిల్లు రాజ్యసభలో ఏకగ్రీవం

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. పార్టీలకు అతీతంగా సభ్యులంతా స్పందించారు.

Updated : 22 Sep 2023 07:01 IST

పార్టీలకతీతంగా సమర్థించిన ఎంపీలు
అనుకూలంగా 214 మంది ఓటు
11 గంటలపాటు జరిగిన చర్చ

ఈనాడు, దిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. పార్టీలకు అతీతంగా సభ్యులంతా స్పందించారు. సుమారు 11 గంటలపాటు చర్చ జరిగిన తర్వాత గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 214 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలికినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లు 2/3 వంతు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు ఓటింగ్‌ అనంతరం సభాపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. ఆ తర్వాత సభను ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా వేశారు. లోక్‌సభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యసభలో ఓటింగ్‌ సమయంలో ప్రధాని సభలోనే ఉన్నారు. బిల్లు ఆమోదం పట్ల ఆయన సంతోషంగా కనిపించారు. చర్చలో కొంత మంది ప్రతిపక్ష సభ్యులు ‘ఇది ఎన్నికల గిమ్మిక్కు’ అని అభివర్ణించినా చివరకు ఓటింగ్‌లో మద్దతుగా నిలిచారు. అయితే జన గణన, డీలిమిటేషన్లను త్వరగా పూర్తి చేసి రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తేవాలని డిమాండు చేశారు.

లోక్‌సభలో బుధవారం ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల 128వ రాజ్యాంగ సవరణ బిల్లును గురువారం కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత తొమ్మిదేళ్లుగా మహిళల సాధికారత కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇదొకటని ఆయన తెలిపారు. బిల్లులో హారిజంటల్‌గా, వర్టికల్‌గా రిజర్వేషన్లు ఉంటాయని, ఎస్సీ, ఎస్టీల కోటా 33 శాతానికి అనుగుణంగా ఉంటుందని చెప్పారు. డీలిమిటేషన్‌ కమిషన్‌ మహిళలకు దక్కే సీట్లపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలపడంతో ఇక తదుపరి ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందాక చట్టంగా మారితే 2024 ఎన్నికల తర్వాత జన గణన, డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమల్లోకి రానుంది. 2029 తర్వాతే అమల్లోకి రానుందని బుధవారమే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికల్లా నియోజకవర్గాల సంఖ్యను పెంచుతారా.. ఉన్న వాటిలోనే కోటా అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బిల్లులోని క్లాజ్‌ 5పై అభ్యంతరం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌ కసరత్తు పూర్తయ్యేంత వరకూ బిల్లు అమల్లోకి రాదని చెప్పడం విచారకరమన్నారు. దీనిని ఎన్నికల జుమ్లా చేయొద్దని సూచించారు. ఈ బిల్లులో ఓబీసీ మహిళలకూ రిజర్వేషన్లను పొందుపరచాలని కోరారు.


మహిళా ఎంపీలే సభను నడపాలి: ధన్‌ఖడ్‌

బిల్లు ప్రవేశపెట్టడానికి రెండు రోజుల ముందు నోటీసు ఇవ్వాలనే నియమం ఉన్నా లోక్‌సభలో ఆమోదం పొందిన మరుసటి రోజే రాజ్యసభలో చర్చకు అనుమతించానని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తెలిపారు. సభ వైస్‌ ఛైర్‌పర్సన్లుగా ఉన్న పీటీ ఉష, జయా బచ్చన్‌, ఫౌజియా ఖాన్‌, డోలా సేన్‌, కనిమొళి సభను నిర్వహించాలని సూచించారు. మహిళా బిల్లుపై చర్చకు ఏడున్నర గంటల సమయాన్ని కేటాయించానని చెప్పారు. కానీ సభలో దాదాపు 11 గంటలపాటు చర్చ జరగడం విశేషం. ఉదయం 11 గంటల నుంచి మొత్తం ప్రక్రియ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలైంది. మధ్యలో భోజన విరామం తీసుకున్నారు.


తొలి ఓబీసీ ప్రధానిని ఇచ్చింది భాజపాయే: నడ్డా

మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ కోటా అమలు చేయాలని ప్రతిపక్షాలు రాజ్యసభలో డిమాండు చేయడంపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. అసలు దేశానికి తొలి ఓబీసీ ప్రధానిని అందించిందే భాజపా అని స్పష్టం చేశారు. 303 మంది భాజపా ఎంపీల్లో 85 మంది ఓబీసీలేనని స్పష్టం చేశారు. దేశంలోని భాజపా ఎమ్మెల్యేల్లో 27శాతం మంది, ఎమ్మెల్సీల్లో 40శాతం మంది ఓబీసీలేనని తెలిపారు.


ఓబీసీల ప్రస్తావన లేదు: సీతారామన్‌

పార్లమెంటు కొత్త భవనంలో సరికొత్త ఉదయం మహిళా రిజర్వేషన్ల బిల్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మహిళల విషయంలో భాజపా రాజకీయాలు చేయబోదని స్పష్టం చేశారు. ‘రాజ్యసభ, కౌన్సిళ్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే సూచన మంచిదే.. అయితే పరోక్ష ఎన్నికలు కావడంవల్ల సాధ్యం కాకపోవచ్చు’ అని సీతారామన్‌ పేర్కొన్నారు. ‘ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లుగా ఓబీసీలకు రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్ల ప్రస్తావన ఎక్కడా లేదు. అందుకే 33 శాతం కోటాలో జనరల్‌, ఎస్సీ, ఎస్టీ కోటా ఉంటుంది. ఓబీసీలకు ఉండదు’ అని తెలిపారు.


తొమ్మిదిన్నరేళ్లు ఎందుకు పట్టింది: కాంగ్రెస్‌

మహిళా రిజర్వేషన్ల బిల్లును తేవడానికి భాజపా ప్రభుత్వానికి తొమ్మిదిన్నరేళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రంజీత్‌ రంజన్‌ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాజ్యసభలో ఆమె చర్చను ప్రారంభించారు. ‘అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం భాజపా మహిళలను ఉపయోగించుకుని లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోంది. నోట్ల రద్దు సమయంలో, రైతు చట్టాల విషయంలో కేంద్రం ఎవరినీ సంప్రదించలేదు. మీరు లోక్‌సభ, అసెంబ్లీల్లో సీట్లను పెంచి రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు ఇవ్వకూడదు.. మహిళా కోటాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప కోటాను అమలు చేయాలి’ అని రంజీత్‌ కోరారు. బిల్లుకు పూర్తి మద్దతిస్తున్నామని చెప్పారు.

  • మహిళలు చట్ట సభల్లో రిజర్వేషన్లను 9 ఏళ్లుగా కోల్పోవడానికి భాజపాయే కారణమని సీపీఎం ఎంపీ ఎలమారం కరీం విమర్శించారు. కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఓడిపోవడంతో భాజపా ఈ ఎత్తుగడ వేసిందని ధ్వజమెత్తారు. అయినా ప్రస్తుత బిల్లుకు మద్దతిస్తున్నామని చెప్పారు.
  • మహిళా బిల్లును తెచ్చిన సమయంపై జేడీయూ ఎంపీ రామ్‌నాథ్‌ ఠాకుర్‌ అభ్యంతరం తెలిపారు.
  • బిల్లును తెచ్చిన సమయంపై అభ్యంతరాలను లేనెత్తడం తగదని భాజపా ఎంపీ సరోజ్‌ పాండే అభిప్రాయపడ్డారు. అమృత కాలంలో తెచ్చామని వెల్లడించారు.
  • జేడీఎస్‌ అధినేత దేవెగౌడ బిల్లుకు మద్దతు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లులను గుర్తు చేసుకున్నారు.
  • మహిళా బిల్లును సెలక్ట్‌ కమిటీకి అప్పగించాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా కోరారు.
  • బిల్లును ఆమోదించిన వెంటనే రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ డిమాండు చేశారు. గడచిన తొమ్మిదేళ్లలో ఈ బిల్లుపై మోదీ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు.
  • జయా బచ్చన్‌ (సమాజ్‌వాదీ), రజనీ అశోక్‌రావ్‌ పాటిల్‌ (కాంగ్రెస్‌), మౌసం నూర్‌ (తృణమూల్‌) బిల్లుకు మద్దతు తెలిపారు.
  • మహిళా బిల్లు విషయంలో ప్రభుత్వానికి సహకారం అవసరమని, కమాండో తరహా ఆపరేషన్‌ తగదని, రహస్యంగా చేయాల్సిన అవసరం లేదని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ అబిప్రాయపడ్డారు. బిల్లుకు ఆయన సంపూర్ణ మద్దతు పలికారు.
  • 2029 నుంచి బిల్లు అమలు చేస్తామని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని ఎంపీ కపిల్‌ సిబల్‌ డిమాండు చేశారు.

రెండు రోజులపాటు ఉభయ సభల్లో మహత్తర మహిళా బిల్లుపై విస్తృత చర్చ జరిగింది. 132 మంది సభ్యులు సార్థక చర్చ జరిపారు. ఈ చర్చలో పాల్గొన్నవారు వినిపించిన ప్రతి మాటకూ విలువ ఉంది. బిల్లును సమర్థించిన వారందరికీ హృదయ పూర్వక అభినందనలు. అన్ని పార్టీలు వ్యక్తం చేసిన సకారాత్మక ఆలోచనలు నారీశక్తికి సరికొత్త బలాన్నిస్తాయి.

ప్రధాని మోదీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని