కొవిడ్‌లో కొత్త రకాలను గంటలోనే పట్టేయవచ్చు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 నిరోధానికి టీకాలు వేస్తున్న తరుణంలో కరోనా వైరస్‌కు సంబంధించిన కొత్త రకాలు ఉత్పన్నమై, ప్రపంచానికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టాయి.

Updated : 06 Feb 2021 09:38 IST

పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసిన సీఎస్‌ఐఆర్‌ ‘ఫెలూదా’ బృందం

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 నిరోధానికి టీకాలు వేస్తున్న తరుణంలో కరోనా వైరస్‌కు సంబంధించిన కొత్త రకాలు ఉత్పన్నమై, ప్రపంచానికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఎన్‌501వై అనే రకం పలు దేశాల్లో కలవరం సృష్టిస్తోంది. కొవిడ్‌-19 బాధితులు, అనుమానితుల నుంచి సేకరించిన నమూనాల్లోని వైరస్‌ల జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం ద్వారా ఈ కొత్త రకాన్ని గుర్తించడం సాధ్యమవుతోంది. ఇందుకు 36-48 గంటల సమయం పడుతోంది. ఈ ఇబ్బందిని దూరం చేస్తూ.. కరోనా వైరస్‌ రకాలను గంటలోనే గుర్తించే సరికొత్త విధానం సిద్ధమైంది. భారత శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. ఈ బృందం.. గత ఏడాది కొవిడ్‌-19 నిర్ధారణకు కాగితం ఆధారిత పరీక్ష ‘ఫెలూదా’ను అభివృద్ధి చేసింది.
తాజాగా రూపొందించిన పరీక్షకు ర్యాపిడ్‌ వేరియంట్‌ అసే (రే) అని నామకరణం చేశారు. దిగ్గజ బెంగాలీ చిత్ర దర్శకుడు సత్యజిత్‌ రేకు నివాళిగా ఈ పేరు పెట్టారు. ఫెలూదా తరహాలో ‘రే’ పరీక్ష కూడా కాగితం ఆధారంగానే పనిచేస్తుంది. ఇది ప్రధానంగా ‘కాస్‌-9’ అనే ప్రొటీన్‌ సాయంతో పనిచేస్తుంది. కొత్త రకం వైరస్‌ జన్యుపటంలోని నిర్దష్ట భాగాన్ని ఇది గుర్తించి, దానికి అతక్కుంటుంది. ఒకవేళ ఆ భాగం లేకుంటే వైరల్‌ జన్యుపటానికి అతుక్కోదు. దీనివల్ల ‘నెగిటివ్‌’ ఫలితం వస్తుంది. ఈ పరీక్ష వల్ల కలిగే మరో ప్రయోజనమేంటంటే.. భవిష్యత్‌లో కొత్తగా వచ్చే కరోనా వైరస్‌లనూ గుర్తించగలిగేలా దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. వైరస్‌లో మార్పులు సహజం. అందువల్ల కరోనా వైరస్‌కు సంబంధించి కూడా భవిష్యత్‌లో కొత్తరకాలు పుట్టుకొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతర రకాలతో పోలిస్తే ఎన్‌501వై చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దీన్ని త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు