నైజీరియాలో 300 మంది పాఠశాల విద్యార్థినుల అపహరణ సాయుధుల దురాగతం!

నైజీరియా ఉత్తర ప్రాంతంలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై శుక్రవారం ఉదయం  సాయుధులు దాడిచేసి 300 మంది విద్యార్థినులను అపహరించుకుపోయారు.

Updated : 27 Feb 2021 10:02 IST

లాగోస్‌: నైజీరియా ఉత్తర ప్రాంతంలోని ఓ ప్రభుత్వ బాలికల పాఠశాలపై శుక్రవారం ఉదయం  సాయుధులు దాడిచేసి 300 మంది విద్యార్థినులను అపహరించుకుపోయారు. జామ్‌ఫరా రాష్ట్రం జాంగేబ్‌లోని ప్రభుత్వ సెకెండరీ పాఠశాల వద్దకు తుపాకులతో మూకుమ్మడిగా వచ్చిన దుండగులు అక్కడే కొన్ని గంటల పాటు ఉన్నారు. తమ దురాగతానికి అడ్డు తగలకుండా ఉండేందుకు అంతకుముందు వారంతా సమీపంలోని ఓ సైనిక శిబిరం, చెక్‌పోస్టులపై కూడా దాడికి తెగబడినట్లు స్థానికులు తెలిపారు. డబ్బు కోసం, జైలులో ఉన్న తమ సభ్యుల విడుదల కోసం బందిపోటు ముఠాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు జామ్‌ఫరా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అపహరణకు గురైన విద్యార్థులను సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర గవర్నర్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే కంగారాలోని ఓ ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు, టీచర్లు సహా 42 మందిని దుండగులు అపహరించగా వారి జాడ ఇంతవరకు తెలియరాలేదు. 2014 ఏప్రిల్‌లోనూ బోర్నో రాష్ట్రంలోని బిబోక్‌ సెకెండరీ స్కూల్‌ నుంచి బోకోహారమ్‌ తీవ్రవాదులు 276 మంది బాలికలను అపహరించుకుపోగా వారిలో దాదాపు 100 మంది ఏమయ్యారో ఇంతవరకు తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని