తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం

తూర్పు తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది! కొండ పైనుంచి ఓ ట్రక్కు జారిపడి కిందనున్న పట్టాలపై పడగా... అటుగా వెళ్తున్న రైలు దాన్ని ఢీకొని సమీపంలోని సొరంగంలో చిక్కుకుపోయంది. పట్టాలు తప్పి, బోగీలు చెల్లాచెదురయ్యాయి.

Updated : 03 Apr 2021 11:11 IST

48 మంది మృతి
100 మందికి గాయాలు
  కొండ పైనుంచి ట్రక్కు జారి పట్టాలపై పడటంతో ఘటన

హూలియన్‌ కంట్రీ: తూర్పు తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది! కొండ పైనుంచి ఓ ట్రక్కు జారిపడి కిందనున్న పట్టాలపై పడగా... అటుగా వెళ్తున్న రైలు దాన్ని ఢీకొని సమీపంలోని సొరంగంలో చిక్కుకుపోయంది. పట్టాలు తప్పి, బోగీలు చెల్లాచెదురయ్యాయి. వాటిలో కింది సీట్లలో కూర్చున్నవారు తీవ్రంగా నలిగిపోయారు. ఈ దుర్ఘటనలో కొత్తగా పెళ్లయిన ట్రైన్‌ డ్రైవరు సహా మొత్తం 48 మంది ప్రయాణికులు మరణించారు. సుమారు మరో వంద మంది తీవ్రంగా గాయపడ్డారు. టారోకో గోర్జ్‌ ప్రాంతం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ వెల్లడించింది.
‘ఆత్మీయుల పండుగ’ తొలిరోజే...
సుందర పర్వత ద్వీపంగా తైవాన్‌కు పేరు. ఇక్కడ చాలామంది రైల్లో ప్రయాణించేందుకే ఇష్టపడుతుంటారు. ఎవరు ఎక్కడున్నా... ఏడాదికోసారి కుటుంబాలన్నీ తమ సొంతూళ్లకు చేరుకుని, మృతిచెందిన తమ ఆప్తులకు నాలుగు రోజులపాటు గౌరవ సంస్కారాలు చేపడతాయి. శుక్రవారంతో మొదలయ్యే ఈ ‘టూంబ్‌ స్వీపింగ్‌ ఫెస్టివల్‌’ నిమిత్తం సుమారు 400 మంది... రాజధాని తైపీ నుంచి టైటుంగ్‌ వెళ్లే ‘టారోకో-408’ రైలు ఎక్కారు. వారాంతం కావడంతో వీరిలో చాలామంది పర్యాటకులు కూడా ఉన్నారు. ‘‘సరిగ్గా టారోక్‌ గోర్జ్‌ ప్రాంతంలోని సొరంగ మార్గం వద్ద... మనుషులెవరూ లేని ఓ ట్రక్కు పట్టాలపై పడి ఉంది. రైలు దాన్ని ఢీకొట్టి సొరంగంలో చిక్కుకుపోయింది. చెల్లాచెదురైన బోగీల కిటికీల్లోంచి చాలామంది బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దుర్ఘటనపై విచారణ ప్రారంభమైంది. అయితే ఇంకా ఎవర్నీ అరెస్టు చేయలేదు’’ అని రైల్వే న్యూస్‌ ఆఫీసర్‌ వెంగ్‌ హూయ్‌-పింగ్‌ వివరించారు. తైవాన్‌లో చివరిసారిగా 2018 అక్టోబరులో భారీ రైలు ప్రమాదం సంభవించింది. నాడు ఈశాన్య ప్రాంతంలో ఓ రైలు పట్టాలు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న 18 మంది చనిపోయారు.
తీవ్ర దిగ్భ్రాంతికరం : అధ్యక్షురాలు
ఘటనా స్థలంలో సహాయక బృందాలు చురుగ్గా చర్యలు చేపడుతున్నాయని, ‘టూంబ్‌ స్వీపింగ్‌ ఫెస్టివల్‌’ తొలిరోజే రైలు ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌-వెన్‌ విచారం వ్యక్తం చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు