వారం రోజులుగా.. 180 జిల్లాల్లో కొత్త కేసుల్లేవు

దేశంలో 180 జిల్లాల్లో గత వారం రోజుల్లో కొత్త కొవిడ్‌ కేసులేమీ రాలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు.

Updated : 09 May 2021 07:12 IST

కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

ఈనాడు, దిల్లీ: దేశంలో 180 జిల్లాల్లో గత వారం రోజుల్లో కొత్త కొవిడ్‌ కేసులేమీ రాలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. మహమ్మారి పరిస్థితిపై మంత్రుల బృందం (జీఓఎం) 25వ ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఆన్‌లైన్‌ విధానంలో ఆయన శనివారం మాట్లాడారు. 54 జిల్లాల్లో 3 వారాలుగా, 32 జిల్లాల్లో 4 వారాలుగా ఎలాంటి కేసులు రాలేదని చెప్పారు. ఇంతవరకు 4,88,861 మంది కొవిడ్‌ బాధితులకు ఐసీయూ, 1,70,841 మందికి వెంటిలేటర్‌, 9,02,291 మందికి ఆక్సిజన్‌ అవసరమొచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న క్రియాశీలక కేసుల్లో 1.34% మంది ఐసీయూ, 0.39% మంది వెంటిలేటర్లు, 3.70% మంది ఆక్సిజన్‌ మీద ఉన్నట్లు తెలిపారు.

రెండు డోసులతో రక్షణ..
కొవిడ్‌ నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అందరికీ రెండో డోసు అందించాలని, కేంద్రం పంపించే టీకాల్లో 70% రెండో డోసు కోసమే కేటాయించాలని పేర్కొన్నారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ సుజీత్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో కరోనా పరీక్షలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు వేగంగా పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని