భారతీయ చిత్రకారిణి కళాఖండానికి రూ.37.8 కోట్లు

భారతీయ ప్రముఖ, దివంగత చిత్రకారిణి అమృతా షేర్‌ గిల్‌ 1938లో గీసిన ఓ చిత్రం వేలంలో రికార్డు ధర పలికింది. రూ.37.8 కోట్లకు ఇది అమ్ముడుపోయింది.

Updated : 15 Jul 2021 07:45 IST

దిల్లీ: భారతీయ ప్రముఖ, దివంగత చిత్రకారిణి అమృతా షేర్‌ గిల్‌ 1938లో గీసిన ఓ చిత్రం వేలంలో రికార్డు ధర పలికింది. రూ.37.8 కోట్లకు ఇది అమ్ముడుపోయింది. భారతీయ కళాకారుల చిత్రాలకు సంబంధించి ప్రపంచ వేలంలో దక్కిన రెండో అత్యధిక ధర ఇది కావడం గమనార్హం. అమృత చిత్రాల్లో ఇప్పటివరకూ అత్యధిక ధర పలికింది కూడా ఇదే. వీఎస్‌ గయ్‌టొండె అనే మరో కళాకారుడు గీసిన చిత్రం ఈ ఏడాది రూ.39.98 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ రెండు వేలాలను శాఫ్రాన్‌ఆర్ట్‌ సంస్థ నిర్వహించింది. అమృత విదేశాల నుంచి తిరిగొచ్చిన కొన్నేళ్లకు గోరఖ్‌పుర్‌లోని తన కుటుంబ ఎస్టేట్‌లో ఆ పెయింటింగ్‌ను గీశారు. ‘ఇన్‌ ది లేడీస్‌ ఎన్‌క్లోజర్‌’ పేరుతో చిత్రించిన ఆ కళాఖండంలో కొందరు మహిళలు దైనందిన పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు. దీంతోపాటు తాజా వేలంలో ఎఫ్‌ఎన్‌ సౌజా 1956లో గీసిన చిత్రం రూ.5.04 కోట్లకు, ఎన్‌ఎస్‌ బెంద్రే 1985లో సృజించిన చిత్రం రూ.1.67 కోట్లకు అమ్ముడుపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని