
Whatsapp: భారత్లో 20 లక్షల ఖాతాలపై నిషేధం
తొలి నెలవారీ నివేదికలో వెల్లడి
దిల్లీ: భారత్లో ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15 మధ్య 20 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్ వెల్లడించింది. ఆ కాల వ్యవధిలో 345 మంది నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనలకు అనుగుణంగా తొలిసారి నెలవారీ కాంప్లియన్స్ నివేదికను వాట్సప్ గురువారం సమర్పించింది. ‘‘హానికర/అవాంఛిత సందేశాలను పెద్దమొత్తంలో ఎవరూ పంపకుండా నిలువరించడంపై మేం ఎక్కువగా దృష్టిసారించాం. అలాంటి సందేశాలను అధికంగా పంపిస్తున్న ఖాతాలను గుర్తించడానికి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించుకుంటున్నాం. ఒక్క భారత్లోనే మే 15 నుంచి జూన్ 15 మధ్య 20 లక్షల ఖాతాలను నిషేధించాం. వాటిలో 95 శాతానికి పైగా ఖాతాలపై.. అధీకృతం కాని ఆటోమేటెడ్/బల్క్(స్పాం) సందేశాలను పంపడం వల్లే ముందుజాగ్రత్త చర్యగా కొరడా ఝళిపించాం. డేటా సమీకరణకు తగినంత సమయం అవసరం. 30-45 రోజుల తర్వాత తదుపరి నివేదికను సమర్పిస్తాం’’ అని అందులో వాట్సప్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నెలనెలా సగటున దాదాపు 80 లక్షల ఖాతాలను ఆ కంపెనీ నిషేధిస్తుంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.