పంజ్‌షేర్‌ పంజా విసిరేనా?

అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షేర్‌ ప్రావిన్సు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంకా తమ అధీనంలోకి రాని ఈ లోయను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. భారీస్థాయిలో ఆయుధ సామగ్రితో ఆ ముఠా ఫైటర్లు వందల సంఖ్యలో

Updated : 23 Aug 2021 11:13 IST

ఆక్రమణకు తరలివెళ్లిన తాలిబన్లు  
పోరాటానికి సిద్ధమన్న ప్రావిన్సు బలగాలు

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షేర్‌ ప్రావిన్సు ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంకా తమ అధీనంలోకి రాని ఈ లోయను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. భారీస్థాయిలో ఆయుధ సామగ్రితో ఆ ముఠా ఫైటర్లు వందల సంఖ్యలో పంజ్‌షేర్‌కు వాహనాల్లో బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మరోవైపు- పంజ్‌షేర్‌ సైన్యం కూడా పోరాటానికి తాము సిద్ధమని ప్రకటించింది. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పంజ్‌షేర్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ..

అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్‌ పర్వత శ్రేణుల్లో పంజ్‌షేర్‌ ఉంది. జనాభా దాదాపు లక్షన్నర. అందులో అత్యధికులు తజిక్‌ జాతి ప్రజలు. పంజ్‌షేర్‌ అంటే ‘ఐదు సింహాలు’ అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇక్కడి ప్రజల్లో తెగువ ఎక్కువ. భౌగోళిక పరిస్థితులు కూడా కలిసివస్తుండటంతో.. పంజ్‌షేర్‌ సహజసిద్ధంగానే దుర్బేధ్యమైన కోటగా ఆవిర్భవించింది! 1980ల్లో సోవియట్‌ సైన్యంగానీ, 1990ల్లో తాలిబన్లుగానీ దీన్ని ఆక్రమించుకోలేకపోయారు. నాటి పోరాటాల్లో దిగ్గజ మిలటరీ కమాండర్‌ అహ్మద్‌ షా మసూద్‌ పంజ్‌షేర్‌ను ముందుండి నడిపించారు. తాలిబన్లు, అల్‌ఖైదా ముష్కరులు సంయుక్తంగా కుట్ర పన్ని విలేకరుల వేషంలో ఆత్మాహుతి దాడి జరపడం ద్వారా 2001లో ఆయన్ను పొట్టనపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు అహ్మద్‌ మసూద్‌, అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ పంజ్‌షేర్‌ గడ్డపై తాలిబన్లపై పోరాటానికి వ్యూహాలు రచిస్తున్నారు. తండ్రి బాటలో తాలిబన్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అహ్మద్‌ మసూద్‌ ప్రకటించారు. తమ బలగాలకు ఆయుధాలు అందజేయాల్సిందిగా అమెరికాను ఇటీవల ఆయన కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని