బైడెన్‌ టీకా నిబంధనలపై భారీగా దావాలు!

ఉద్యోగులు తప్పనిసరిగా కొవిడ్‌-19 టీకాలు పొందాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించిన కొత్త నిబంధనలపై రిపబ్లికన్‌ పార్టీ గవర్నర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాల్లో దావాలు వేస్తామని హెచ్చరిస్తున్నారు.

Published : 12 Sep 2021 04:32 IST

కోర్టును ఆశ్రయించనున్న రిపబ్లికన్లు

వాషింగ్టన్‌: ఉద్యోగులు తప్పనిసరిగా కొవిడ్‌-19 టీకాలు పొందాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించిన కొత్త నిబంధనలపై రిపబ్లికన్‌ పార్టీ గవర్నర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాల్లో దావాలు వేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే దీనిపై అధ్యక్షుడు వెనక్కి తగ్గడంలేదు. దీంతో ఫెడరల్‌, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరోసారి వివాదం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. బైడెన్‌ తీసుకురాబోతున్న కొత్త మార్గదర్శకాల్లో అనేకం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఇవి అవసరమని ఆయన గట్టిగా భావిస్తున్నారు. టీకాలు పొందనివారి వల్ల పొంచి ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకొని, ఇది కోర్టుల్లో చెల్లుబాటు అవుతుందన్న ధీమాలో బైడెన్‌ సర్కారు ఉంది. రిపబ్లికన్‌ పార్టీ నేతలతోపాటు ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా దీనిపై కోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. ఇది కంపెనీలపై దాడి అని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ వ్యాఖ్యానించారు. అమెరికన్లు, వారి హక్కుల పరిరక్షణకు తాము న్యాయపోరాటం చేస్తామని రిపబ్లికన్‌ పార్టీ జాతీయ కమిటీ స్పష్టంచేసింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు. కొత్త మార్గదర్శకాల నుంచి కొన్నింటిని తొలగించినా.. మిగతావాటి కారణంగా లక్షల మంది అమెరికన్లు టీకాలు పొందుతారని పేర్నొన్నారు. దీనివల్ల ప్రాణాలు నిలుస్తాయని, వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారు. ఈ అంశంపై ‘ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (ఓషా) నిబంధనలను రూపొందిస్తోంది. వీటి అమలు బాధ్యత కూడా ఈ సంస్థే చేపట్టబోతోంది. వీటికి కట్టుబడకుంటే ఆయా సంస్థలు భారీ జరిమానాలు చెల్లించాల్సి రావొచ్చు.

కొత్త నిబంధనల ప్రకారం వంద మందికిపైగా ఉద్యోగులున్న చోట.. యాజమాన్యాలు చొరవ తీసుకొని అందరికీ తప్పనిసరిగా టీకాలు వేయించాలి. లేదా వారానికోసారి కొవిడ్‌ పరీక్ష చేయించాలి. ఈ నిబంధన 8 కోట్ల మంది అమెరికన్లపై ప్రభావం చూపుతుంది. దీనికితోడు.. ఫెడరల్‌ ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న ఆరోగ్య కేంద్రాల్లోని 1.7 కోట్ల మంది తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులూ టీకాలు పొందాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని