తీవ్రవాదాన్ని అఫ్గాన్‌ తరిమికొట్టాలి

ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్‌ స్థావరంగా మారకూడదని భారత్‌ సహా ఎనిమిది దేశాలు బుధవారం సంయుక్తంగా వెలువరించిన ‘దిల్లీ డిక్లరేషన్‌’ స్పష్టం చేసింది. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం

Updated : 11 Nov 2021 12:06 IST

సమ్మిళిత సర్కార్‌ ఏర్పాటు కావాలి

మైనార్టీ తెగలకూ స్థానమివ్వాలి

మాదక ద్రవ్యాల రవాణా అడ్డుకోవాలి

దిల్లీ డిక్లరేషన్‌లో 8 దేశాల స్పష్టీకరణ

భారత్‌ సహా 8 దేశాల జాతీయ భద్రత సలహాదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

దిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్‌ స్థావరంగా మారకూడదని భారత్‌ సహా ఎనిమిది దేశాలు బుధవారం సంయుక్తంగా వెలువరించిన ‘దిల్లీ డిక్లరేషన్‌’ స్పష్టం చేసింది. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటవ్వాలని, అందులో మైనార్టీ తెగలకు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితులపై భారత్‌ అధ్యక్షతన బుధవారం దిల్లీలో జాతీయ భద్రతా సలహాదారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో రష్యా, ఇరాన్‌, మధ్యాసియా దేశాలైన తజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, కజకస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పాల్గొన్నాయి. పాకిస్థాన్‌, చైనాలనూ భారత్‌ ఆహ్వానించింది. కానీ ఆ రెండు దేశాలు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ డోభాల్‌ అధ్యక్షత వహించారు. ప్రారంభోపన్యాసంలో డోభాల్‌.. అఫ్గాన్‌ సుస్థిరత ఈ ప్రాంతానికి చాలా కీలకమని పేర్కొన్నారు. తర్వాత ఇతర ప్రతినిధులు మాట్లాడారు. సమావేశానంతరం డోభాల్‌తో పాటు ఏడు దేశాల ప్రతినిధులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నాలుగు సూచనలు చేశారు. కాబుల్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఆ దేశ భూభాగాన్ని తీవ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. డ్రగ్స్‌, అక్రమ ఆయుధాల సరఫరాను నిరోధించే వ్యూహాన్ని రూపొందించాలని తెలిపారు. అదే సమయంలో అఫ్గాన్‌లో నెలకొన్న మానవతా సంక్షోభంపైనా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 

డిక్లరేషన్‌ ఏం చెప్పిందంటే..

* ఉగ్ర కార్యకలాపాలకు అఫ్గాన్‌ కేంద్రం కాకూడదు. ఉగ్ర శిక్షణ, ఆశ్రయం కల్పించడం, దాడులకు కుట్రలు, ఆర్థిక సహాయం సహా ఎలాంటి కార్యకలాపాలు అక్కడ చేపట్టకూడదు.

* శాంతియుత, సురక్షిత, సుస్థిర అఫ్గాన్‌కు మద్దతు ఇస్తాం. ఆ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం.

* ఈ సంక్షోభ పరిష్కారంలో ఐరాసది కీలక పాత్ర. అఫ్గాన్‌లో ఐరాస విభాగాలు తమ కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలి.

* అఫ్గాన్‌ ప్రజలకు వివక్ష లేకుండా మానవతా సహాయాన్ని అందించాలి. 

* కుందుజ్‌, కాందహార్‌, కాబుల్‌లో ఉగ్రదాడులను ఖండిస్తున్నాం. మహిళలు, చిన్నారులు, మైనార్టీ తెగల ప్రాథమిక హక్కులను కాపాడాలి.

భారత్‌తో ఇలా.. పాక్‌తో అలా!
చైనా రెండు నాల్కల ధోరణి
అఫ్గాన్‌పై 2018 నుంచి జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి. తొలి రెండు సమావేశాలకు ఇరాన్‌ ఆతిథ్యమిచ్చింది. వీటిలో పాకిస్థాన్‌ పాల్గొనలేదు. చైనా మాత్రం హాజరవుతూ వచ్చింది. ఈ సారి భారత్‌లో జరిగిన సమావేశానికి మాత్రం చైనా కుంటి సాకుతో తప్పించుకుంది. షెడ్యూలింగ్‌ సమస్యలతోనే హాజరుకావడం లేదని పేర్కొంది. అయితే పాక్‌కు మద్దతుగానే చైనా ఈ నిర్ణయం తీసుకుందని.. అఫ్గాన్‌ ప్రజలకు అండగా నిలుస్తున్న భారత్‌ను అడ్డుకోవాలన్నదే ఈ రెండు దేశాల వ్యూహమని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అఫ్గాన్‌పై అమెరికా, రష్యాలతో పాకిస్థాన్‌ గురువారం ఏర్పాటు చేస్తున్న సమావేశానికి మాత్రం చైనా పచ్చజెండా ఊపింది. ఆ సమావేశానికి  హాజరుకానున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని