Covid: కొవిడ్‌ నిమోనియాకు కొత్త విరుగుడు

కొవిడ్‌-19 నిమోనియాతో ఆసుపత్రిపాలైన  రోగులకు సమర్థవంతమైన చికిత్స చేయడానికి పనికొచ్చే సరికొత్త ఔషధాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Updated : 18 Dec 2021 07:59 IST

ఔషధాన్ని గుర్తించిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

లండన్‌: కొవిడ్‌-19 నిమోనియాతో ఆసుపత్రిపాలైన  రోగులకు సమర్థవంతమైన చికిత్స చేయడానికి పనికొచ్చే సరికొత్త ఔషధాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌ రెస్పిరేటరీ మెడికల్‌ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. నామిలుమాబ్‌ అనే యాంటీబాడీ ఔషధంపై వారు పరిశోధన చేశారు. వాస్తవానికి.. కీళ్లవాతంతో ఆసుపత్రిపాలైన రోగులపై ఉపయోగించడానికి దీన్ని రూపొందించారు. ఇది తుది ప్రయోగాల్లో ఉంది. కొవిడ్‌-19 నిమోనియాతో ఆసుపత్రిపాలైనవారిపై ఇదెలా పనిచేస్తుందన్నది పరిశీలించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ రోగుల రక్తంలో ఇన్‌ఫ్లమేషన్‌కు సూచిక అయిన ‘సి రియాక్టివ్‌ ప్రొటీన్‌’ (సీఆర్‌పీ) స్థాయి చాలా ఎక్కువగా ఉంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగినప్పుడు సీఆర్‌పీ స్థాయి పెరుగుతుంటుంది. దీని పరిమాణం పెరిగితే.. కొవిడ్‌ బాధితులకు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక కణాలు సహజసిద్ధంగా సైటోకైన్లను విడుదల చేస్తాయి. ఇవి కొవిడ్‌ రోగుల్లో అపరిమితంగా ఉత్పత్తయి ఊపిరితిత్తుల్లో ప్రమాదకరస్థాయిలో ఇన్‌ఫ్లమేషన్‌ కలిగిస్తుంటాయి. సాధారణ చికిత్స, సంరక్షణ విధానాలతో పోలిస్తే నామిలుమాబ్‌ పొందినవారిలో సీఆర్‌పీ స్థాయి 97శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది. ఈ ఔషధం తీసుకున్నవారిలో 78శాతం మంది 28వ రోజు కల్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని