తండ్రి ఆస్తుల్లో.. దాయాదుల కంటే కుమార్తెలకే ప్రాధాన్యం

వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తులపై కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తండ్రి స్వయంగా సంపాదించిన, ఆస్తుల విభజన ద్వారా పొందినవాటిపై కుటుంబంలోని

Published : 21 Jan 2022 06:22 IST

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి ఆస్తులపై కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తండ్రి స్వయంగా సంపాదించిన, ఆస్తుల విభజన ద్వారా పొందినవాటిపై కుటుంబంలోని దాయాదుల కంటే కుమార్తెలకే ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారిల ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీలుపై ధర్మాసనం విచారించింది. చనిపోయిన హిందూ పురుష వ్యక్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. తండ్రి మరణించాక ఆస్తులు ఆయన సోదరుడి కుమారుడికి చెందుతాయా, సొంత కుమార్తెకు వారసత్వ హక్కు లేదా అనే అంశాలపై ధర్మాసనం విచారణ జరిపి 51 పేజీల తీర్పు వెలువరించింది. ‘‘కుమార్తెలకు, వితంతువైన భార్యకు ఉన్న హక్కును పురాతన హిందూ సంప్రదాయ చట్టాలు, వివిధ తీర్పులు స్పష్టంగా గుర్తించాయి. అయితే- ఒక హిందూ మహిళ ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే మాత్రం ఆమెకు తన తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపాస్తులు ఆమె తండ్రి వారసులకు చెందుతాయి. ఆమెకు భర్త ద్వారా, లేదా మామగారి ద్వారా లభించిన ఆస్తులు భర్త వారసులకు దక్కుతాయి’’ అని విశదీకరించింది. 1994లో దిగువ న్యాయస్థానం, 2009లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని