దేశంలో గాడిదలు తగ్గుతున్నాయ్!
వినియోగం తగ్గటం, చోరీలు, మేత భూమి కొరత, అక్రమంగా వధించటం.. ఇలా కారణాలేవైనా దేశంలో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు.. అంటే ఎనిమిదేళ్ల వ్యవధిలో
8 ఏళ్లలో 61% తగ్గుదల
దిల్లీ: వినియోగం తగ్గటం, చోరీలు, మేత భూమి కొరత, అక్రమంగా వధించటం.. ఇలా కారణాలేవైనా దేశంలో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు.. అంటే ఎనిమిదేళ్ల వ్యవధిలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనం తేల్చింది. ‘బ్రూక్ ఇండియా’ అనే సంస్థ దేశంలో గాడిదల ఉనికి, ఈ మూగ జంతువులతో చేస్తున్న అక్రమ వ్యాపారాలపై అధ్యయనం చేసింది. దేశంలో గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్, బిహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పలువురిని ఇంటర్వ్యూ చేశారు. పశుగణాంక వివరాలు ఆరా తీశారు. దేశంలో అక్షరాస్యత పెరగడం, మోతకు గాడిదలను వాడే ఇటుకల పరిశ్రమ వంటి వాటిలో యంత్రాలు రావడం, రవాణాకు కంచర గాడిదల వైపు మొగ్గుచూపటం వంటి కారణాలతో కూడా గాడిదల సంఖ్య తగ్గుతున్నట్లు అధ్యయనం పేర్కొంది.
* గాడిదలను అక్రమంగా రవాణా చేయడం, వాటి తోలు, మాంసం అక్రమ మార్గాల్లో దేశ సరిహద్దులు దాటించడం కూడా గాడిదల సంఖ్య తగ్గడానికి కారణాలు అవుతున్నట్లు ‘బ్రూక్ ఇండియా’ తేల్చింది. మందుల తయారీ కోసం గాడిదల చర్మం చైనాకు ఎక్కువగా రవాణా అవుతోంది. ‘ఎజియావో’ అనే ఈ ఔషధం పలురకాల రుగ్మతలకు చికిత్సలో వాడుతారు. ‘‘చైనాకు చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్ర దళారితోపాటు వచ్చి ఆ మధ్య నన్ను కలిశాడు. నెలకు 200 గాడిదలు కావాలన్నాడు. గాడిదల చర్మాలు మాత్రమే అడిగాడు’’ అని గాడిదల వ్యాపారి ఒకరు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.