నీట్‌ పీజీ పరీక్ష మే 21న

నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష మే 21న నిర్వహించనున్నట్టు మెడికల్‌ సైన్సెస్‌ విభాగంలోని జాతీయ పరీక్షల బోర్డు శుక్రవారం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12న ఈ పరీక్ష జరగాలి.

Published : 05 Feb 2022 05:18 IST

దిల్లీ: నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష మే 21న నిర్వహించనున్నట్టు మెడికల్‌ సైన్సెస్‌ విభాగంలోని జాతీయ పరీక్షల బోర్డు శుక్రవారం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12న ఈ పరీక్ష జరగాలి. అయితే నీట్‌-2021 కౌన్సెలింగ్‌ కూడా ఇదే సమయంలో ఉన్నందున, పీజీ పరీక్షను 6-8 వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారమే పరీక్షల బోర్డును కోరింది. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన వెలువడింది. అలాగే ఆన్‌లైన్‌లో నీట్‌ పీజీ పరీక్ష దరఖాస్తు సమర్పించేందుకు ఈనెల 4 వరకు ఉన్న గడువును కూడా మార్చి 25 వరకు పెంచారు. నీట్‌ పీజీ పరీక్ష మే నాటికి వాయిదా వేయడంతో ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న ఎంబీబీఎస్‌ విద్యార్థులు కూడా ఆ పరీక్షకు హాజరయ్యే అవకాశం వచ్చిందని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (వైద్య విద్య) డా.బి.శ్రీనివాస్‌ చెప్పారు.

నీట్‌ మాకొద్దంటూ రాజ్యసభలో డీఎంకే నిరసన

నీట్‌ నుంచి తమిళనాడును మినహాయిస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన బిల్లును అక్కడి గవర్నర్‌ వెనక్కు పంపడంపై డీఎంకే సభ్యులు శుక్రవారం రాజ్యసభలో నిరసన తెలిపారు. వీరికి కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు మద్దతు పలికారు. డీఎంకే సభ్యులు జీరో అవర్‌లో ఈ సమస్యను లేవనెత్తగా ఛైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు తిరస్కరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్‌ విషయాన్ని ప్రస్తావించుకోవచ్చని ఛైర్మన్‌ సూచించినా.. సభ్యులు వినిపించుకోలేదు. నిరసన కొనసాగించిన సభ్యులు అనంతరం వాకౌట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని