అత్యంత కాలుష్యపూరిత రాజధాని దిల్లీ
దేశంలో వాయు కాలుష్యం తీవ్రతను తాజా నివేదిక ఒకటి కళ్లకు కట్టింది. ప్రపంచంలోని 100 అత్యంత కలుషిత నగరాల్లో 63 భారత్లోనే ఉన్నట్లు తేల్చింది. మరోవైపు, ప్రపంచంలోకెల్లా అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా దిల్లీ వరుసగా నాలుగోసారి నిలిచింది.
వరుసగా నాలుగో ఏడాది ఖాతాలో చెత్త రికార్డు
ప్రపంచంలోని 100 అత్యంత కలుషిత నగరాల్లో 63 భారత్లోనే
దిల్లీ: దేశంలో వాయు కాలుష్యం తీవ్రతను తాజా నివేదిక ఒకటి కళ్లకు కట్టింది. ప్రపంచంలోని 100 అత్యంత కలుషిత నగరాల్లో 63 భారత్లోనే ఉన్నట్లు తేల్చింది. మరోవైపు, ప్రపంచంలోకెల్లా అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా దిల్లీ వరుసగా నాలుగోసారి నిలిచింది. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ ‘ప్రపంచ వాయు నాణ్యత నివేదిక- 2021’ పేరుతో మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పలు చేదు విషయాలను వెలుగులోకి తెచ్చింది. అందులోని వివరాల ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను గత ఏడాది భారత్లో ఏ ఒక్క నగరమూ అందుకోలేకపోయింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో భివాడీ (రాజస్థాన్) తొలి స్థానంలో నిలవగా.. గాజియాబాద్ (ఉత్తర్ప్రదేశ్) 2వ, దిల్లీ 4వ స్థానంలో ఉన్నాయి.
గాలిలో ప్రమాదకర పీఎం 2.5 ధూళికణాల గాఢత ఆధారంగా తాజా నివేదికను ఐక్యూఎయిర్ రూపొందించింది. ఇందుకోసం 117 దేశాల్లోని 6,475 నగరాల్లో పరిస్థితులను విశ్లేషించింది. డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాల ప్రకారం గాలిలో పీఎం 2.5 ధూళికణాలు.. ఒక్కో క్యూబిక్ మీటరుకు 5 మైక్రోగ్రాములను మించకూడదు. కానీ దిల్లీలో ప్రతి క్యూబిక్ మీటరుకు వాటి పరిమాణం 96.4 మైక్రోగ్రాములుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఆ విలువ 84 మైక్రోగ్రాములు మాత్రమే. ఏడాదిలో మన దేశ రాజధానిలో పీఎం 2.5 ధూళికణాల కాలుష్యం 14.6% మేర పెరిగింది. తాజా నివేదికలో ప్రపంచంలోకెల్లా అత్యంత కాలుష్యపూరిత రాజధానుల జాబితాలో దిల్లీ తర్వాత వరుస స్థానాల్లో ఢాకా (బంగ్లాదేశ్), ఎన్జమీనా (చద్), దుశాంబే (తజికిస్థాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయి. భారతీయ నగరాల్లో ప్రతి క్యూబిక్ మీటర్కు పీఎం 2.5 ధూళికణాల వార్షిక సగటు 2021లో 58.1 మైక్రోగ్రాములుగా ఉంది. డబ్ల్యూహెచ్వో నిర్దేశిత ప్రమాణాలతో పోలిస్తే ఇది 10 రెట్లకు పైగా ఎక్కువ. వరుసగా మూడేళ్ల పాటు దేశంలో కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టినా.. మళ్లీ గత ఏడాది పెరుగుదల నమోదు కావడం ఆందోళనకరం. ప్రధానంగా వాహన ఉద్గారాలు, బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు, పరిశ్రమల వ్యర్థాల వంటివి వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా