Navjot Singh Sidhu: కోర్టులో లొంగిపోయిన సిద్ధూ.. పటియాలా జైలుకు తరలింపు

మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో.. శుక్రవారం ఆయన పటియాలా కోర్టులో

Updated : 21 May 2022 08:06 IST

పటియాలా: మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో.. శుక్రవారం ఆయన పటియాలా కోర్టులో లొంగిపోయారు. తన నివాసం నుంచి 58 ఏళ్ల సిద్ధూ దుస్తుల బ్యాగుతో జిల్లా కోర్టుకు వెళ్లారు. ఆయన వెంట కొంత మంది కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. మెజిస్ట్రేట్‌ ముందు లొంగిపోయిన తర్వాత నిబంధనల ప్రకారం సిద్ధూను వైద్యపరీక్షల నిమిత్తం మాతా కౌసల్య ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు పూర్తయిన వెంటనే పోలీస్‌ జీపులో పటియాలా సెంట్రల్‌ జైలుకు తరలించారు. అంతకుముందు సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఆరోగ్య కారణాల రీత్యా తనకు కొన్ని వారాల సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సిద్ధూ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ జె.బి. పర్దీవాలా ధర్మాసనం ముందుంచారు. అయితే ఈ కేసులో ప్రత్యేక బెంచ్‌ తీర్పు ఇచ్చినందున.. తాజా అభ్యర్థనపై తాము నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ పిటిషన్‌ను సమర్పించాలని, ఆయనే ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సిద్ధూ కోర్టులో లొంగిపోయారు. 34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధూకు గురువారం సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని