అత్యున్నత స్థానానికి న్యాయవ్యవస్థ కీర్తి

‘‘నేను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంతవరకూ న్యాయార్థం వచ్చేవారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఏ మాత్రం తలవంపులు లేకుండా భారత న్యాయవ్యవస్థ కీర్తిని అత్యున్నత స్థానానికి తీసుకెళ్తానని మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నా..’’ అని

Updated : 26 Jun 2022 06:37 IST

అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా

త్వరలో జడ్జీలుగా 140 మంది పేర్ల సిఫార్సు

భాషా పరిరక్షణలో తమిళుల ఐక్యత స్ఫూర్తిదాయకం

అమెరికా తెలుగువారి సభలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, దిల్లీ: ‘‘నేను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంతవరకూ న్యాయార్థం వచ్చేవారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఏ మాత్రం తలవంపులు లేకుండా భారత న్యాయవ్యవస్థ కీర్తిని అత్యున్నత స్థానానికి తీసుకెళ్తానని మీ అందరి సమక్షంలో ప్రతిజ్ఞ చేస్తున్నా..’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌లో ‘ఉత్తర అమెరికా తెలుగు సమాజం’ ఏర్పాటు చేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో సతీమణి శివమాలతో సహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ గురించి, తెలుగు భాష ఔన్నత్యంపైనా మాట్లాడారు. ‘‘ప్రజాక్షేమమే పరమావధిగా సత్వర న్యాయం చేయాలన్నది నా లక్ష్యం. భారత న్యాయవ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరి నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు దక్కింది. దేశంలో 1,100 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టుల్లో ఎప్పుడూ 500 ఖాళీగా ఉండేవి. నా హయాంలో 190 మంది పేర్లను సిఫార్సు చేస్తే 180 మంది న్యాయమూర్తుల నియామకం జరిగింది. ఇంకా 140 పేర్లను త్వరలో సిఫార్సు చేయబోతున్నాం’’ అని ఆయన వివరించారు.

సొంత లాభం కొంత మానుకుని..

తెలుగువారు ఎక్కడున్నా మాతృభాషను, సామాజిక బాధ్యతలను మరచిపోవద్దని జస్టిస్‌ రమణ పిలుపునిచ్చారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడాలన్న గురజాడ మాటను నిరంతరం నెమరేసుకోవాలని చెప్పారు. ‘‘అమెరికా వినువీధుల్లో తెలుగుబావుటా ఎగరేస్తూ భారతదేశ రాయబారులుగా ఉన్న మిమ్మల్ని కలవడం అదృష్టంగా భావిస్తున్నాను. కష్టపడి ఒక స్థానాన్ని సంపాదించుకొని, తెలుగు జాతికి, భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. సంప్రదాయాలను, సంస్కృతిని, భాషను మరవకుండా ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ మీరు జీవించడం గొప్ప విషయం. మీ అందరి చేతుల్లో తెలుగు జాతి సురక్షితంగా ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. పుట్టిన ఊరు, మట్టి వాసన, సంప్రదాయ వంటలు, మన మనుషుల పలకరింపులు, చదువు చెప్పిన మాస్టార్లు, మన పొలాలను గురించి నెమరేసుకోవడం మరిచిపోవద్దు. తెలుగు ఒక జీవన విధానం. మన భాషను ఎలా గౌరవించుకుంటామో పరాయి భాషనూ అలాగే గౌరవిస్తాం. అలాంటి వినయం తెలుగులోనే ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి.

తమిళులను చూసి గర్వపడాలి.. పాఠాలు నేర్వాలి

నాకు తమిళనాడుతో పెద్ద సంబంధాలు లేకపోయినా తమిళ సంఘం వారు నా రాకను తెలుసుకొని సన్మానానికి పిలిచారు. తమిళనాడుకు చెందిన రాజరాజేశ్వరి అనే మహిళ న్యూయార్క్‌ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆమె తాను తమిళ మహిళనని గర్వంగా చెప్పుకొన్నారు. నేను తమిళనాడులో నెలరోజుల క్రితం పర్యటించినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నాయకులు వచ్చి కలిశారు. మా భాషను గౌరవించండి, మా హైకోర్టులో తమిళంలో వాదోపవాదాలు జరిగేలా చూడండి అని కోరారు. చరిత్రను చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు పటిష్ఠంగా ఉంది. భాష, సంస్కృతి కోసం వారు ఎవరినైనా ఎదురించడానికి వెనుకాడరు. దాన్ని చూసి గర్వపడాలి. తెలుగుజాతి ఐక్యంగా ఎలా ఉండాలన్న అంశంపై వారినుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనం దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చిన తర్వాత ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం.


భాషను ఉపయోగించకపోతే జాతి అంతరించిపోతుంది

మన భాష, సంస్కృతిని మర్చిపోతే కొన్ని తరాల తర్వాత మన జాతి అంతరించిపోతుంది. ఆంగ్లం నేర్చుకుంటే తప్ప ఉద్యోగాలు రావన్న అపోహ తప్పనడానికి నేనే సజీవ ఉదాహరణ. నేను మీ అందరి గౌరవం పొందుతున్నానంటే అందుకు కారణం మాతృభాష వేసిన పునాదే. ఎంతోమంది మహానుభావులు మనకు అమూల్యమైన సంపద ప్రసాదించారు. దీనిని కాపాడుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అమెరికాలో 2010-17 మధ్యకాలంలో తెలుగు మాట్లాడేవారు 85% పెరగడం సంతోషకరం. మిగతా ఆసియా భాషలతో పోలిస్తే మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. మీ సంపదను ప్రశాంతంగా అనుభవించే పరిస్థితులు ఉండాలి. అశాంతి, అసమానతల్ని తొలగించకుండా సమాజం పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎంత సంపాదించినా దాన్ని అనుభవించలేం.


ఆడంబరాలు నన్ను ప్రభావితం చేయవు

మీరు విశ్వ మానవులు. అన్ని తరగతుల ప్రజలను సమానంగా గుర్తించి, గౌరవించి మర్యాదపూర్వకంగా చూసుకోవడం మరవొద్దు. అభివృద్ధి చెందాలంటే ఆత్మవిశ్వాసం అవసరం. రాష్ట్రపతిని కలిసినా, సామాన్యుడిని కలిసినా నా ప్రవర్తనలో మార్పు ఉండదు. ఆడంబరాలు నన్ను ప్రభావితం చేయవు. నా ఊరు, నేల, నా వాళ్లు నేర్పిన సంస్కారం ఇది. ప్రతి ఒక్కరిలో అది ఉండాలని కోరుకుంటున్నా. ఆ సంస్కారమే నన్ను సన్మార్గంలో నడిపిస్తుందని భావిస్తున్నా’’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ దంపతులను, కొవాగ్జిన్‌ టీకా సృష్టికర్తలైన భారత్‌ బయోటెక్‌ అధిపతులు కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంపతులను తెలుగు ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భారత్‌ కాన్సులేట్‌ జనరల్‌ రణ్‌ధీర్‌ జైశ్వాల్‌, తానా మాజీ అధ్యక్షుడు జై తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని