Azadi Ka Amrit Mahotsav: కనబడని నాలుగు వాయు సింహాలు
స్వాతంత్య్రం కోరితే... మీకింకా పరిణతి రాలేదని తోసిపుచ్చిన ఆంగ్లేయులు... వాయుసేన విషయంలో మాత్రం భారత ప్రతిభను, సత్తాను ముందే అంగీకరించారు. ‘యుద్ధవిమానాలు నడపటం మగవారి పని. అది భారతీయులకు రాదు’
స్వాతంత్య్రం కోరితే... మీకింకా పరిణతి రాలేదని తోసిపుచ్చిన ఆంగ్లేయులు... వాయుసేన విషయంలో మాత్రం భారత ప్రతిభను, సత్తాను ముందే అంగీకరించారు. ‘యుద్ధవిమానాలు నడపటం మగవారి పని. అది భారతీయులకు రాదు’ అంటూ హేళన చేసినవారే... 1932లోనే భారత వాయుసేన ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ఆంగ్లేయుల్లో ఈ మార్పునకు కారణం... ఓ నలుగురు వీర భారతీయులు!
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో లక్షల మంది భారతీయులను సైన్యంలోకి తీసుకొని పదాతిదళంలో విదేశాల్లో తమతరఫున బరిలోకి దించిన ఆంగ్లేయులు... వాయుసేన రాయల్ ఎయిర్ఫోర్స్లోకి మాత్రం వారిని దాదాపు దూరంగానే ఉంచారు. కొంతమందిని సాంకేతిక, ఇతర పనులకు వాడుకున్నా... భారతీయులకు యుద్ధ విమానాలు నడిపే తెలివి లేదని భావించారు. ఈ భావన... చాలాకాలం కొనసాగింది. అందుకే... బ్రిటిష్ వాయుసేన మాజీ అధిపతి ఎయిర్మార్షల్ సర్ జాన్ స్టీల్... ‘‘భారతీయులకు యుద్ధవిమానాలు నడిపే శక్తియుక్తులు లేవు. అది మగవారి పని’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆంగ్లేయులకు ఇలాంటి చిన్నచూపున్న నేపథ్యంలో నలుగురు భారతీయులు- కృష్ణచంద్ర వెలింకర్, సర్దార్ హర్దీత్ సింగ్ మాలిక్, ఎరోల్ సువో చందర్సేన్, ఇంద్రాలాల్ రాయ్లు... అనూహ్యంగా రాయల్ ఎయిర్ఫోర్స్లోకి ప్రవేశించారు. తమ వీరోచిత పోరాటాలతో ఆంగ్లేయులను ఆశ్చర్యపరిచారు. తర్వాతికాలంలో భారత వాయుసేన ఆవిర్భావానికి బీజాలు వేశారు. ఈ నలుగురిలో ఇద్దరు (కృష్ణచంద్ర, ఇంద్రాలాల్ రాయ్) వీరమరణం పొందారు. తర్వాత తెల్లవారి కళ్లు తెరుచుకోవటం ఆరంభమైంది. మొదటి ప్రపంచయుద్ధం ముగిశాక భారతీయులకు సైన్యంలో ప్రాధాన్యం పెంచాలని... పదోన్నతులివ్వాలని, సొంతంగా వాయుసేన ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరిగాయి. రాయ్, సర్దార్ మాలిక్, కృష్ణచంద్ర, చందర్సేన్ల వీరత్వం, ప్రతిభను ఆంగ్లేయ అధికారులే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో... 1932 అక్టోబరు 8న భారత వాయుసేన ఆరంభానికి బ్రిటిష్ సర్కారు అంగీకరించింది. ఆరుగురు భారతీయులను యుద్ధ పైలట్లుగా ఎంపిక చేసి శిక్షణ కోసం ఇంగ్లాండ్కు పంపించింది. వీరికి తోడుగా ఆంగ్లేయ పైలట్లూ సేనలో ఉండేవారు. కానీ భారతీయులెంతగా అల్లుకుపోయారంటే... తమ తెల్లవారందరినీ బ్రిటిష్ సర్కారు వెనక్కి తీసుకొని... 1939 సెప్టెంబరు 3న పూర్తిగా భారతీయులతోనే తొలి వాయుసేన దళాన్ని ఆవిష్కరించింది. భారతీయుడు సుబ్రతో ముఖర్జీని కమాండింగ్ అధికారిగా నియమించింది.
మార్చురీ నుంచి లేచివచ్చి...
సంపన్న బెంగాలీ కుటుంబంలో 1898లో కలకత్తాలో జన్మించిన ఇంద్రాలాల్ రాయ్ మొదటి ప్రపంచయుద్ధం నాటికి లండన్ స్కూల్లో చదువుతున్నాడు. చదువుల్లో చురుకైన రాయ్ ఓ ఆధునిక మోర్టార్ డిజైన్ గీసి... యుద్ధ కార్యాలయానికి పంపించాడు. అవి నచ్చిన సర్కారు... ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపకారవేతనం ఇచ్చింది. రాయల్ ఎయిర్ఫోర్స్లో పైలట్గా చేరతానంటూ దరఖాస్తు చేసుకుంటే... ఆంగ్లేయులు వైద్య కారణాలతో నిరాకరించారు. ఆ కారణాలు తప్పని నిరూపించటంతో చేర్చుకోక తప్పింది కాదు. 18 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ రాయల్ ఎయిర్ఫోర్స్లో చేరిన రాయ్... జర్మనీ విమానాలపై దాడులతో అందరినీ ఆశ్చర్యపర్చటం మొదలెట్టాడు. ఈ క్రమంలో 1917 డిసెంబరు 6న ఆయన నడుపుతున్న విమానం జర్మనీ దాడిలో ఫ్రాన్స్లో కూలింది. చనిపోయాడనుకొని రాయ్ని మార్చురీలో పెట్టారు. సృహలోకి వచ్చాక మార్చురీ తలుపులు బాదటంతో... చూసిన సిబ్బంది ఆయనను ఇంగ్లాండ్కు తరలించారు. 1918లో మళ్లీ యుద్ధ విమానమెక్కాడు. నెలరోజుల్లో... పది జర్మనీయుద్ధ విమానాలను నేలకూల్చి ఫ్లయింగ్ ఏస్ అవార్డు సాధించాడు. దురదృష్టవశాత్తు... 1918 జులై 22న జర్మనీ దాడిలో విమానం కూలి 19 ఏళ్ల రాయ్ కన్నుమూశారు.
అంబులెన్స్ నడిపి....
రావల్పిండిలోని సిక్కు కుటుంబంలో జన్మించిన హర్దీత్సింగ్ మాలిక్ చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. యుద్ధ సమయంలో విద్యార్థులనూ సైన్యంలోకి తీసుకున్నారు. చాలామంది రాయల్ ఎయిర్ఫోర్స్కు వెళ్లారు. అయితే హర్దీత్ను మాత్రం... భారతీయుడనే నెపంతో తిరస్కరించి మిలిటరీ ఆసుపత్రిలో సేవలందించమన్నారు. దీంతో... ఫ్రెంచ్ రెడ్క్రాస్లో చేరి అంబులెన్స్ నడుపుతూ ఫ్రెంచ్ ఎయిర్ సర్వీస్కు దరఖాస్తు చేసుకున్నాడు. వాళ్లు అంగీకరించారనే సంగతి తెలియగానే... బ్రిటిష్వారు కూడా మళ్లీ పిలిచి రాయల్ ఎయిర్ఫోర్స్లో ఫైటర్ పైలట్గా తీసుకున్నారు. రెండు జర్మనీ విమానాలు కూల్చాక... ఓ రోజు ప్రత్యర్థిదాడిలో హర్దీత్ గాయపడ్డాడు. బుల్లెట్లు కాల్లో దిగి ప్రాణాలతో బయటపడ్డాడు. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన కృష్ణచంద్ర, కూచ్ బిహార్ సంస్థానాధీశులకు చెందిన చందర్సేన్లు కూడా తమ నైపుణ్యాలతో యుద్ధంలో ఆంగ్లేయులను ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!