మలేసియాకు మన తేజస్‌!

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌’ మన మిత్రదేశాల అమ్ములపొదిలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ అద్భుత లోహ విహంగాల కొనుగోలుకు మలేసియా ఆసక్తి చూపుతోంది. చైనా, రష్యా యుద్ధవిమానాలను

Updated : 04 Jul 2022 06:22 IST

భారత తయారీ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆసక్తి

త్వరలోనే ఒప్పందం

దిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌’ మన మిత్రదేశాల అమ్ములపొదిలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ అద్భుత లోహ విహంగాల కొనుగోలుకు మలేసియా ఆసక్తి చూపుతోంది. చైనా, రష్యా యుద్ధవిమానాలను తోసిరాజని తేజస్‌ వైపు మొగ్గుతుండటం మన వైమానిక తయారీ సామర్థ్యాన్ని చాటిచెబుతోంది. ఈ అంశంపై ఒప్పందం ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాల మధ్య తుది దశ చర్చలు జరుగుతున్నాయి.

తన వైమానిక దళంలో పాతబడిపోతున్న రష్యన్‌ తయారీ మిగ్‌-29 యుద్ధవిమానాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడానికి మలేసియా కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు చైనాకు చెందిన జేఎఫ్‌-17, దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన ఎఫ్‌ఏ-50, రష్యా రూపొందించిన మిగ్‌-35, యాక్‌-130 యుద్ధవిమానాలను పరిశీలించింది. వీటి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ తేజస్‌పైనే మలేసియా ఆసక్తి చూపుతోందని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) సీఎండీ ఆర్‌.మాధవన్‌ పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా మలేసియాలో యుద్ధవిమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికీ భారత్‌ ముందుకొచ్చింది.

తేజస్‌ కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి మలేసియా నుంచి ఉన్నతాధికారులు, నిపుణులు త్వరలో భారత్‌ సందర్శించనున్నారు. ఎఫ్‌ఏ-50తో పోలిస్తే తేజస్‌ చాలా మెరుగైన విమానమని మాధవన్‌ తెలిపారు. తేజస్‌ను హెచ్‌ఏఎల్‌ ఉత్పత్తి చేస్తోంది. ఇది ఒకే ఇంజిన్‌ కలిగిన సూపర్‌సోనిక్‌ యుద్ధవిమానం. బహుళ పోరాట సామర్థ్యం దీని సొంతం. గగనతలంలో మెరుపులా కదులుతూ అద్భుత విన్యాసాలను చేయగలదు. శత్రుదుర్భేద్య ప్రాంతాల్లోకి అలవోకగా దూసుకెళ్లి దాడులు చేయగలదు. బహుళ ప్రయోజన యుద్ధవిమాన (ఎంఎఫ్‌ఆర్‌ఏ) ప్రాజెక్టు కింద భారత్‌లో అధునాతన ఫైటర్‌ జెట్‌లను ఉత్పత్తి చేయడానికి విదేశీ సంస్థల భాగస్వామ్యానికి హెచ్‌ఏఎల్‌ చాలా అనువైందని మాధవన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని