మీడియా భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినట్లే
దేశంలో జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడుతుండటం, వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు పెరగడం వంటి పరిణామాలపై పలు మీడియా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వాలు విలేకర్లను లక్ష్యంగా చేసుకుంటే మొత్తం
విలేకర్లను ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటుండటంపై పాత్రికేయ సంఘాల ఆందోళన
దిల్లీ: దేశంలో జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడుతుండటం, వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు పెరగడం వంటి పరిణామాలపై పలు మీడియా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వాలు విలేకర్లను లక్ష్యంగా చేసుకుంటే మొత్తం పాత్రికేయ వృత్తి భవితవ్యాన్నే ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని పేర్కొన్నాయి. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్ ఇటీవల అరెస్టవడం, పులిట్జర్ అవార్డు గ్రహీత సనా మట్టూ (ఫొటో జర్నలిస్టు) దేశం విడిచి వెళ్లకుండా నిషేధాజ్ఞలు ఎదుర్కొంటుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సహా మొత్తం ఏడు మీడియా సంఘాలు దిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశాయి.
‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్ తాజా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు కేంద్రప్రభుత్వం, అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ‘ఆల్ట్ న్యూస్’ ప్రధాన అడ్డంకిగా నిలుస్తోందని పేర్కొన్నారు. అందుకే దాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపుతూ సమావేశంలో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై జీ7 దేశాలు గత నెలలో విడుదల చేసిన తీర్మానం గురించి అందులో ప్రస్తావించారు. ప్రధాని మోదీ కూడా దానిపై సంతకం చేసిన సంగతిని గుర్తుచేశారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు న్యాయ సహాయం అందించేందుకు వివిధ నగరాల్లో న్యాయవాదుల కమిటీలు ఏర్పాటుచేయాలని సీనియర్ పాత్రికేయులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.