గుట్టలుగా నోట్లు.. కిలోలకొద్దీ బంగారం!

మహారాష్ట్రకు చెందిన రెండు సంస్థల్లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు, వజ్రాలను స్వాధీనం చేసుకుంది. 30కి పైగా ప్రాంగణాల్లో చేసిన సోదాల్లో ఇప్పటివరకూ రూ.56 కోట్ల నగదు

Published : 12 Aug 2022 05:58 IST

ఐటీ సోదాల్లో పట్టుబడ్డ రూ.56 కోట్ల నగదు.. రూ.14 కోట్ల ఆభరణాలు

మహారాష్ట్రలోని రెండు సంస్థల్లో పెద్ద ఎత్తున అక్రమాలు

దిల్లీ: మహారాష్ట్రకు చెందిన రెండు సంస్థల్లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు, వజ్రాలను స్వాధీనం చేసుకుంది. 30కి పైగా ప్రాంగణాల్లో చేసిన సోదాల్లో ఇప్పటివరకూ రూ.56 కోట్ల నగదు, రూ.14 కోట్ల విలువైన ఆభరణాలు పట్టుబడినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ(సీబీడీటీ) గురువారం ప్రకటించింది. జాల్నా, ఔరంగాబాద్‌, నాసిక్‌, ముంబయిల్లో ఈ నెల 3న సోదాలు చేపట్టినట్లు పేర్కొంది. స్టీల్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నిర్వహించే ఈ సంస్థలు పెద్ద ఎత్తున పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు తెలిపింది. అయితే ఆ సంస్థల పేర్లను సీబీడీటీ వెల్లడించలేదు. సోదాల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. ఓ సహకార బ్యాంకులో ఆ రెండు సంస్థల యజమానులు, ఉద్యోగుల పేర్లతో ఖాతాలు తెరిచి 30కి పైగా లాకర్లు నిర్వహిస్తున్నారని, వాటిలో కట్టల కొద్దీ నగదు, ఆభరణాలను దాచారని, వాటిని లెక్కల్లో చూపలేదని పేర్కొంది. మరో చోట ఓ ఫాంహౌస్‌లోని రహస్య గదిలోనూ భారీ ఎత్తున నగదు లభ్యమైనట్లు తెలిపింది. దీంతోపాటు వివిధ సంస్థల నుంచి కొనుగోళ్లు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించడం ద్వారా సంస్థల వ్యయాన్ని అక్రమంగా పెంచి చూపించాయని, జీఎస్టీ మోసాలకూ పాల్పడ్డాయని పేర్కొంది. ఖాతాల్లో నమోదు చేయని రూ.120 కోట్లకుపైగా విలువైన ముడి సరకును గుర్తించినట్లు వెల్లడించింది.

మరో సంస్థలో రూ.11 కోట్ల స్వాధీనం

రాజస్థాన్‌ జైపుర్‌కు చెందిన ఓ సంస్థలో నిర్వహించిన సోదాల్లో రూ.150 కోట్ల మేర లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ పేర్కొంది. బంగారు ఆభరణాలు, ఆతిథ్య సేవలు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఆ సంస్థకు చెందిన రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని