దేశవ్యాప్తంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’

స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇచ్చిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పిలుపు మేరకు శనివారం భాజపా శ్రేణులు, నేతలు తమ నివాసాలపై జాతీయ పతాకాలను ఎగురవేశారు.

Published : 14 Aug 2022 06:13 IST

దిల్లీ: స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇచ్చిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ పిలుపు మేరకు శనివారం భాజపా శ్రేణులు, నేతలు తమ నివాసాలపై జాతీయ పతాకాలను ఎగురవేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తమ గృహాలపై జెండాలను ఆవిష్కరించిన అనంతరం ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దేశ విభజన రోజునాటి ఘోరాలను తెలిపే ప్రదర్శనను దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు నడ్డా తెలిపారు. దేశవాప్తంగా ప్రభాత భేరీలు, ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర మంత్రులు, భాజపా సీనియర్‌ నేతలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

* రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) సామాజిక మాధ్యమ ఖాతాల్లోని తన ప్రొఫైల్‌ పిక్‌ను శుక్రవారం మార్చింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ అకౌంట్లలో డీపీలుగా కాషాయ జెండాను తీసేసి త్రివర్ణ పతాకాలను ఉంచింది. జాతీయ పతాకం విషయంలో ఆరెస్సెస్‌ వైఖరిని కాంగ్రెస్‌ తదితర పార్టీలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. నాగ్‌పుర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంలో చాలా ఏళ్లపాటు జాతీయ జెండాను ఎగురవేయలేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని ఆరెస్సెస్‌ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేయనున్నట్లు ఆ సంస్థ ప్రచార విభాగ ఇన్‌ఛార్జి నరేందర్‌ ఠాకూర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని