NIA: అతివాద సంస్థ పీఎఫ్ఐపై ఎన్ఐఏ కన్నెర్ర
విదేశాల నుంచి నిధులు అందుకొని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న అభియోగాలను ఎదుర్కొంటున్న అతివాద ఇస్లామిక్ సంస్థ.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు
15 రాష్ట్రాల్లో సోదాలు.. 100మందికి పైగా అరెస్టు
ఏపీలో నలుగురు, తెలంగాణలో ఒకరు..
దాడుల్లో పాల్గొన్న పలు కేంద్ర ఏజెన్సీలు: సమీక్షించిన అమిత్ షా
దిల్లీ: విదేశాల నుంచి నిధులు అందుకొని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న అభియోగాలను ఎదుర్కొంటున్న అతివాద ఇస్లామిక్ సంస్థ.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కన్నెర్ర చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆ సంస్థ కార్యాలయాలు, సభ్యుల నివాసాలపై గురువారం ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో సోదాలు జరిపి 106 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్ఐ ప్రభావం అధికంగా ఉన్న కేరళలో 22 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో ఆ సంస్థ ఛైర్మన్ ఓ.ఎం.ఎ.సలామ్ కూడా ఉన్నారు. కేరళ తర్వాత అత్యధిక అరెస్టులు వరుసగా మహారాష్ట్ర(20), కర్ణాటక (20),తమిళనాడు (10), అస్సాం (9), ఉత్తర్ప్రదేశ్(8), ఆంధ్రప్రదేశ్ (4), తెలంగాణలో అబ్దుల్ వారిస్ (1), మధ్యప్రదేశ్(4), పుదుచ్చేరి(3), దిల్లీ (3), రాజస్థాన్(2)లో జరిగాయి. ఓ విచారణ ప్రక్రియలో ఇంత భారీస్థాయిలో దాడులు గతంలో ఎన్నడూ జరగలేదని, దేశంలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఈ దాడులు తెల్లవారుజమున 3.30 ప్రారంభమయ్యాయి. మొత్తం 300మంది అధికారులు పాల్గొన్నారు.
ఉగ్ర నిధులే లక్ష్యంగా..!
దాడుల్లో పీఎఫ్ఐ ఆర్థిక మూలాలపైనే అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చి, శిక్షణ శిబిరాలు నిర్వహించి, నిషేధిత సంస్థల్లో పౌరులు చేరేలా ప్రేరేపిస్తున్న వ్యక్తులను గుర్తించి..వారి నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు. 2006లో కేరళలో ఏర్పడిన పీఎఫ్ఐపై ఆరంభం నుంచీ పలు ఆరోపణలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ సంస్థకు వ్యతిరేకంగా పలు కేసులు నమోదయ్యాయి. ఎన్ఐఏతో పాటు.. ఈడీ కూడా పీఎఫ్ఐ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తోంది. ఆర్థిక అక్రమ లావాదేవీలకు సంబంధించి లఖ్నవూ కోర్టులో ఈడీ ఇప్పటికే ఈ సంస్థకు వ్యతిరేకంగా రెండు అభియోగపత్రాలను దాఖలు చేసింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలతో పాటు..2020లో జరిగిన దిల్లీ అల్లర్ల వెనుక కూడా ఈ సంస్థ హస్తంపై విచారణ జరుగుతోంది.
ఈ మొత్తం ఆపరేషన్.. అమిత్షా కనుసన్నల్లో జరిగింది. గురువారం ఆయన...జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్గుప్తా తదితరులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐపై, ఉగ్ర అనుమానితులపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వచ్చారు. కేంద్ర సంస్థల దాడులను పీఎఫ్ఐ ఖండించింది. ఇందుకు నిరసనగా శుక్రవారం కేరళ వ్యాప్తంగా హర్తాళ్కు పిలుపునిచ్చింది. మరోవైపు యువత సంయమనం వహించాలని వివిధ ముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
కొందరిని ఊచకోత కోసింది: ఎన్ఐఏ
పీఎఫ్ఐ తన హింసాత్మక చర్యలతో ప్రజలను భయాందోళనలకు గురి చేసిందని సోదాలు అనంతరం గురువారం రాత్రి ఎన్ఐఏ ఒక ప్రకటన విడుదల చేసింది. ఓ కళాశాల ప్రొఫెసర్ చేతిని నరికివేయడంతో పాటు.. ఇతర మతాలకు చెందిన వ్యక్తులను దారుణంగా ఊచకోత కోసిందని పేర్కొంది. సోదాల్లో ఆ సంస్థ పలు నేరాలకు పాల్పడినట్లు నిరూపించే పత్రాలు, డిజిటల్ పరికరాలు లభ్యమయ్యాయని వెల్లడించింది.
నిషేధం విధిస్తారా..!
తాజా దాడుల నేపథ్యంలో పీఎఫ్ఐపై కేంద్రం నిషేధం విధించనుందన్న వార్తలు వెలువడుతున్నాయి. గత ఏడాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పీఎఫ్ఐపై నిషేధం విధించే దిశగా కేంద్రం ఆలోచిస్తుందని సుప్రీంకోర్టులో తెలిపారు. నిషేధిత సిమీ సంస్థతో పీఎఫ్ఐకి అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలో కేంద్ర మంత్రులు కూడా పీఎఫ్ఐ నిషేధంపై మాట్లాడారు.
హైదరాబాద్లో పీఎఫ్ఐ కార్యాలయం మూత
ఈనాడు, హైదరాబాద్ - కేశవగిరి, న్యూస్టుడే: పీఎఫ్ఐ తెలంగాణ కార్యాలయానికి ఎన్ఐఏ మూత(సీల్)వేసి నోటీసు అంటించింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్న ఎన్ఐఏ తాజాగా గురువారం హైదరాబాద్లో తనిఖీలు చేసింది. చాంద్రాయణగుట్ట చౌరస్తా సమీపంలోని ఫారూఖ్-ఎ-ఆజం మసీదు పక్కనున్న భవనంలోని పీఎఫ్ఐ కార్యాలయానికి తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలోనే ఎన్ఐఏ బృందం చేరుకుంది. రాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్), స్థానిక పోలీసులు వెంట ఉన్నారు. పీఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా చెబుతున్న ఈ భవనంలో డిజిటల్ పరికరాలతో పాటు పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం సీల్ వేసి కార్యాలయ గోడకు నోటీసు అంటించారు. నిజామాబాద్లో పీఎఫ్ఐ కార్యకలాపాల పేరిట మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందంటూ నమోదైన కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా సోదాలకు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కార్యాలయాన్ని తెరవాలంటే ముందుగా భవన యజమాని నాంపల్లిలోని ఎన్ఐఏ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలోగాని మాదాపూర్లోని ఎన్ఐఏ కార్యాలయంలోగాని సంప్రదించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ హఫీజ్బాబానగర్ సీ-బ్లాక్లో నివసించే సయ్యద్ ఖాలెద్పాషా ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. పీఎఫ్ఐ రాష్ట్రశాఖకు ఆయన కోశాధికారిగా, హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా ఉన్నట్లు సమాచారం. 2020 కరోనా సమయంలో లాక్డౌన్ నిషేధాన్ని ఉల్లంఘిస్తూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినందుకు కేసు నమోదైంది.
అదంతా ప్రచారమే
మరోవైపు గురువారం కరీంనగర్లో ఎనిమిది చోట్ల, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ ఎన్ఐఏ సోదాలు జరిగాయని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఎన్ఐఏ ప్రకటనతో అదంతా ప్రచారమే అని తేలిపోయింది.
విచారించాక అరెస్టుల పర్వం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో పీఎఫ్ఐకు చెందిన నలుగురు వ్యక్తులను ఎన్ఐఏ అధికారులు గురువారం అరెస్టు చేశారు. గుంటూరు చౌత్రా సెంటర్లో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయంలో తొలుత సోదాలు చేశారు. ఇక్కడ కొన్ని మతగ్రంథాలు, సాహిత్యం వంటి పుస్తకాలు లభ్యమైనట్లు సమాచారం. ఆ తర్వాత కూరగాయల వ్యాపారి అబ్దుల్ వహీద్ ఆలీ(సుద్దపల్లి డొంక), స్థిరాస్తి వ్యాపారి అబ్దుల్ రహీం(పొత్తూరివారితోట), ఆటో మొబైల్ వ్యాపారి రియాజ్(సంగడిగుంట), డ్రైఫ్రూట్స్ వ్యాపారి పఠాన్ జప్రూల్లాఖాన్(హుస్సేన్ నగర్)ల గృహాల్లో సోదాలు చేశారు. పాతగుంటూరు పోలీసులను సంప్రదించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తరువాత అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్