వచ్చేసింది నాలుగో విప్లవం..!

ఇలా... మానవ జీవనంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే 5జీ వచ్చేసింది! ప్రపంచవ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు శనివారం నుంచి మనదేశంలోనూ ఆరంభం కాబోతున్నాయి. ప్రస్తుతానికి.. ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే అవి అందుబాటులోకి వస్తాయంటున్నారు.

Updated : 01 Oct 2022 09:10 IST

ఎంత పెద్ద సినిమానైనా ఒక్కక్లిక్‌తో ఫోన్లో డౌన్లోడ్‌ చేసుకోవచ్చు..
ఆఫీస్‌ నుంచే ఇంట్లో కుక్కర్‌ను ఆన్‌ చేయొచ్చు,
ఆఫ్‌ చేయొచ్చు.
ఆన్‌లైన్‌లో దుస్తులు షాపింగ్‌ చేసేటప్పుడు..
మనం వాటిని ధరిస్తే ఎలా ఉంటుందో ఫోన్లోనే చూసుకోవచ్చు..
డ్రైవర్‌ లేని కార్లను తయారు చేయొచ్చు..
మారుమూల ప్రాంతాలకూ ఆధునిక వైద్యం అందించొచ్చు..

ఇలా... మానవ జీవనంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే 5జీ వచ్చేసింది! ప్రపంచవ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు శనివారం నుంచి మనదేశంలోనూ ఆరంభం కాబోతున్నాయి. ప్రస్తుతానికి.. ఎంపిక చేసిన కొన్ని నగరాల్లోనే అవి అందుబాటులోకి వస్తాయంటున్నారు. తర్వాత నెట్‌వర్క్‌ సదుపాయాలు పెరిగేకొద్దీ క్రమంగా వాటిని విస్తరిస్తారు. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని పట్టణాలకే పరిమితమయ్యాయి.

4జీ ఫోన్లను 5జీలోకి మార్చుకోవచ్చా?

లేదు. ఫోన్‌లోని మోడెమ్‌, ప్రాసెసర్‌లను 5జీకి సరిపోయే వాటితో మార్చి, సాఫ్ట్‌వేర్‌ను కూడా మారిస్తే తప్ప అది కుదరదు. మార్కెట్లో ఇది కానిపని. చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా.

4జీ ఫోన్‌లో 5జీ పని చేస్తుందా?

పాత 4జీ స్మార్ట్‌ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌ను కూడా అందుకుంటుంది. కానీ.. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ పరిమితుల వల్ల కొన్ని ఫోన్లు 5జీ సేవలను పూర్తిస్థాయిలో అందించలేకపోవచ్చు. మీ 4జీ ఫోన్‌ 5జీకి సరిపోతుందో లేదో సర్వీస్‌ ప్రొవైడర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

రేట్లు మారుతాయా?

అధికారికంగా ప్రకటించకున్నా 4జీ ఖర్చులతో పోలిస్తే 5జీ ఖర్చులు భారీగా ఉండకపోవచ్చు. అయితే డేటా వేగం పెరుగుతున్న కారణంగా... వినియోగదారులు 5జీలో అధికంగా డేటాను వినియోగించే అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా టెలికం కంపెనీలకు ప్రతి వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే.. ఛార్జీలు పెంచకున్నా, కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

మేక్‌ ఇన్‌ ఇండియా...

ఇప్పటిదాకా టెలికం రంగంలోని 1జీ నుంచి 4జీ దాకా   ప్రతిసారీ నెట్‌వర్క్‌ సదుపాయాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే. 5జీలో మాత్రం దేశీయంగా ఉత్పత్తిచేసిన పరికరాలనే వాడుతున్నారు.

లాభాలేంటి?

హైస్పీడ్‌. డౌన్‌లోడ్‌ పేరుతో గింగిరాలు తిరగటం 5జీలో ఉండదు. బటన్‌ నొక్కగానే క్షణంలో సినిమా డౌన్‌లోడ్‌ అవుతుంది. అంతరాయాలు లేకుండా గేమ్‌లూ ఆడుకోవచ్చు. బ్యాండ్‌విడ్త్‌ పెరుగుతుంది.

కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, వర్చువల్‌ రియాల్టీలాంటి ఆధునిక పరిజ్ఞానానికి 5జీ ఎంతో ఉపకరిస్తుంది.

భవిష్యత్‌లో బ్యాంకింగ్‌ సేవలు మరింత సులభతరం అవుతాయి. వ్యవసాయంలో సాంకేతికత విస్తరిస్తుంది. ఆన్‌లైన్‌ చదువుల్లో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంది.

నష్టాలేంటి?

అందరికీ అందుబాటులోకి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు. ఎందుకంటే... 5జీ టవర్ల ఏర్పాటు  భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రపంచవ్యాప్తంగానే కొన్నిచోట్లే 5జీ టవర్లు ఉన్నాయి. ఇది టెక్నాలజీ అసమానతలకు దారితీస్తుంది.

డౌన్‌లోడ్‌ స్పీడ్‌ వేగంగా ఉన్నా... అప్‌లోడింగ్‌ స్పీడ్‌ తక్కువే ఉండొచ్చనేది నిపుణుల ఆందోళన.

త్వరగా డిశ్ఛార్జి కావడంతో, ఎక్కువసార్లు ఛార్జింగ్‌ పెట్టడం వల్ల బ్యాటరీల జీవితకాలం తగ్గొచ్చని భావిస్తున్నారు.

సరైన ఎన్‌క్రిప్షన్‌ ప్రక్రియ చేపట్టకుంటే సైబర్‌ దాడుల ప్రమాదం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

పైలట్లకు విమాన మార్గంలో దృశ్యస్పష్టత (విజిబిలిటీ) తక్కువగా ఉన్నప్పుడు ఆల్టీమీటర్లను వినియోగిస్తారు. ఇవి 4.2-4.4 గిగాహెర్జ్స్‌ (సీ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ)తో పనిచేస్తాయి. 5జీ సేవలకూ ఇలాంటి ఫ్రీక్వెన్సీ వాడితే, ఆల్టీమీటర్లు పనిచేయవని, అందువల్ల విమానాల రాకపోకలకు భద్రత ఉండదనే భయం ఏర్పడింది. జనవరిలో అమెరికాలో 5జీ సేవలను ప్రారంభించినప్పుడు, ఎయిర్‌ ఇండియా కూడా కొన్ని విమానాలను రద్దు చేసుకుంది. ఇప్పుడు పరిస్థితి కుదుటపడింది. - ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని