నిర్దేశిత విద్యార్హతలు లేకున్నా ప్రొఫెసర్‌

నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ప్రొఫెసర్ల నియామకానికి అర్హతలను సడలించింది.

Published : 01 Oct 2022 06:27 IST

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కొత్త మార్గదర్శకాలు

ఈనాడు, దిల్లీ: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ప్రొఫెసర్ల నియామకానికి అర్హతలను సడలించింది. ఇదివరకటిలా కేవలం నిర్దేశిత విద్యార్హతలు ఉన్నవారినే కాకుండా వివిధ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని ప్రొఫెసర్లుగా నియమించుకోవడానికి అనుమతిస్తూ శుక్రవారం మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చేలా విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఉన్నత విద్యలో పరిశ్రమ-విద్యారంగం మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ మామిడాల జగదీష్‌కుమార్‌ పేర్కొన్నారు ‘ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌’ పేరుతో కొత్తవారిని బోధకులుగా తీసుకోవడంవల్ల తరగతులకు అనుభవపూర్వకమైన నైపుణ్యం రావడంతోపాటు, ఉన్నత విద్యాసంస్థల్లో బోధనాసిబ్బంది కొరతను నివారించడానికి వీలవుతుందనేది యూజీసీ ఉద్దేశం.

* విద్యార్హతలతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్‌, సాంకేతికం, పరిశ్రమలు, వాణిజ్యం, సామాజికశాస్త్రం, మీడియా, సాహిత్యం, లలితకళలు, సివిల్‌ సర్వీసెస్‌, సాయుధ దళాలు తదితర రంగాల్లో విశిష్టమైన నైపుణ్యం, విస్తృత అనుభవం (కనీసం 15 ఏళ్లు) ఉన్న వారిని ప్రొఫెసర్లుగా తీసుకోవచ్చు. అయితే వీరిసంఖ్య ఉన్నత విద్యాసంస్థలకు మంజూరుచేసిన పోస్టుల్లో 10%కి మించకూడదు.

* ఈ ప్రొఫెసర్లను కోర్సులు, పాఠ్యాంశాల రూపకల్పనలో భాగస్వాములుగా చేయొచ్చు. యూనివర్సిటీ, కాలేజీలకు మంజూరుచేసిన పోస్టులకు అతీతంగా వీరి నియామకం జరుగుతుంది. అందువల్ల అధికారికంగా మంజూరుచేసిన పోస్టులపై ఎలాంటి ప్రభావం చూపదు. గౌరవవేతనం ఎంత చెల్లించాలన్నది ఉన్నత విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చు.

* ‘ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌’కు గరిష్ఠంగా మూడేళ్లకు మించి అవకాశం ఇవ్వకూడదు. అరుదైన కేసుల్లో ఏడాది పొడిగించవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ వారి సర్వీసు నాలుగేళ్లకు మించకూడదు.


ఏకకాలంలో 2 డిగ్రీల విధానాన్ని సత్వరం అమల్లోకి తెండి

అందుకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేసుకోండి

విశ్వవిద్యాలయాలకు యూజీసీ ఆదేశం

దిల్లీ: భౌతిక విధానంలో ఒకే సమయంలో విద్యార్థులు రెండు డిగ్రీలు పూర్తి చేసేలా తమ నిబంధనల్లో సత్వరమే చట్టబద్ధ మార్పులు చేసుకోవాలని దేశంలోని విశ్వవిద్యాలయాలకు శుక్రవారం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) లేఖ రాసింది. విద్యార్థుల విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఈ పథకం... సత్వరం అమలయ్యేలా చూడాలని అందులో పేర్కొంది. ఏకకాలంలో రెండు డిగ్రీల ప్రతిపాదనకు ఏప్రిల్‌లో యూజీసీ ఆమోదం తెలిపింది. తర్వాత మార్గదర్శకాలనూ విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని