మూడొంతుల మురుగు నదుల్లోకే
దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో కేవలం 28% మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72% నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్ ‘ఇటీవల విడుదల చేసిన అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా’ అన్న నివేదికలో పేర్కొంది.
సరస్సులు, భూగర్భంలోకి కూడా
నీతి ఆయోగ్ వెల్లడి
పట్టణ వ్యర్థ జలాల శుద్ధీకరణ పెంచాలని సూచన
ఈనాడు, దిల్లీ: దేశంలో పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో కేవలం 28% మాత్రమే శుద్ధి అవుతోందని, మిగిలిన 72% నదులు, సరస్సులు, భూగర్భంలోకి వెళుతోందని నీతి ఆయోగ్ ‘ఇటీవల విడుదల చేసిన అర్బన్ వేస్ట్ వాటర్ సినారియో ఇన్ ఇండియా’ అన్న నివేదికలో పేర్కొంది. అందువల్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నీటి శుద్ధీకరణ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. ‘‘ప్రస్తుత దేశ జనాభా 138 కోట్లు. అందులో 65% (90 కోట్లమంది) గ్రామీణప్రాంతాల్లో ఉంటే 35% మంది (48 కోట్లమంది) పట్టణప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజూ 39,604 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంటే, పట్టణ ప్రాంతాల నుంచి 72,368 మిలియన్ లీటర్లు వస్తున్నాయి. పట్టణప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరగడంతో నీటి వినియోగం పెరిగింది.
రోజుకు 28 శాతమే శుద్ధి
ప్రస్తుతం దేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీటిలో 28% (రోజుకు 20,236 మిలియన్ లీటర్లు) మాత్రమే శుద్ధి అవుతోంది. మిగిలిన 72% శుద్ధిచేయని మురుగునీరు నదులు, సరస్సులు, భూగర్భంలో కలుస్తోంది. దానివల్ల ఆ జలవనరుల్లోని నీరు కలుషితమై నాణ్యత దిగజారుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని 323 నదుల పరిధిలోని 351 పాయల్లో ప్రవహించే నీటి నాణ్యతను బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ద్వారా కొలుస్తోంది. దాని ప్రకారం 13% భారతీయ నదీ పాయలు తీవ్రంగా కలుషితం అయ్యాయి. బీఓడీకి తోడు కెమికల్ ఆక్సిజన్ స్థాయి, భారలోహాలు, ఆర్సెనిక్, ఫ్లోరైడ్స్, ప్రమాదకరమైన రసాయనాలు అత్యధికచోట్ల కనిపించాయి. మరీ ముఖ్యంగా భూగర్భజలాల్లో వీటి శాతం ఎక్కువ కనిపించింది. అందువల్ల ఉత్పత్తి అవుతున్న, శుద్ధిచేస్తున్న నీటి మధ్య ఉన్న అగాధాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. వ్యర్థ జలాలను విలువైన వనరుగా వాడుకోవాలి. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాట్లలో సవాళ్లు ఎదురు కావడమే ఈ అగాధానికి కారణమవుతోంది. పట్టణప్రాంతాల్లో ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి లేకపోవడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మ్యాపింగ్ చేయకపోవడం, లీకేజీలను గుర్తించకపోవడం, వ్యర్థజలాలను చట్టవిరుద్ధంగా ఎక్కడో ఒకచోట వదిలేస్తుండడం వంటివి ప్రధాన సమస్యగా మారాయి. మురుగునీటి శుద్ధి ఖర్చును తగ్గించే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకపోవడం, శుద్ధిచేసిన నీటిని మళ్లీ ఉపయోగించడానికి ప్రజలు విముఖత చూపడం కూడా లక్ష్యానికి అడ్డంకిగా మారింది. అందువల్ల ఈ సవాళ్లను తొలగించి మురుగునీటిని చౌకగా శుద్ధిచేసి, మళ్లీ ఉపయోగించే కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అంది పుచ్చుకోవాలి.
శుద్ధిచేసిన నీటిపై నమ్మకం కలిగించాలి
శుద్ధిచేసిన నీటి నాణ్యతపై వినియోగదారులకు నమ్మకం కలిగించాలి. అది మనుషుల ఆరోగ్యం, పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయదనే విశ్వాసాన్ని బలంగా కల్పించగలగాలి. మురుగునీటి శుద్ధికి ప్రాకృతిక పరిష్కారమార్గాలు అనుసరించాలి. శుద్ధిచేసిన నీటిని తిరిగి ఉపయోగించడంవల్ల ఎలాంటి నష్టం లేదన్న విషయాన్ని ప్రజలకు విస్తృతంగా అందుబాటులో ఉంచాలి. మురుగునీటిని శుద్ధిచేసి ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశ సుస్థిరాభివృద్ధికి అది అంత సమర్థంగా ఉపయోగపడుతుంది’’ అని నీతి ఆయోగ్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ