Jammu Kashmir: మంచులోయకు మంచి రోజులొచ్చాయా!

బాంబు పేలుళ్లు.. తుపాకీ మోతలు.. రాళ్ల దాడులు.. బంద్‌లతో అట్టుడికిన ప్రాంతమది. సంవత్సరంలో సగం రోజులు అక్కడ కర్ఫ్యూ కొనసాగేది.

Updated : 08 Nov 2022 10:03 IST

సరికొత్త కశ్మీర్‌ దిశగా అడుగులు
ఊపందుకున్న పర్యాటకం
రాళ్ల దాడుల ఊసే లేదు
స్థానికుల్లో కనిపిస్తున్న మార్పు
అయినా సవాల్‌ విసురుతున్న టార్గెట్‌ కిల్లింగ్స్‌, హైబ్రిడ్‌ టెర్రరిజం, చొరబాట్లు
వలసాల వీరభద్రం
శ్రీనగర్‌ నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి
‘ఈనాడు’ పరిశీలనలో ఆసక్తికర విషయాలు

బాంబు పేలుళ్లు.. తుపాకీ మోతలు.. రాళ్ల దాడులు.. బంద్‌లతో అట్టుడికిన ప్రాంతమది. సంవత్సరంలో సగం రోజులు అక్కడ కర్ఫ్యూ కొనసాగేది. బడులు తెరచుకోకుండానే విద్యా సంవత్సరం పూర్తయిన సందర్భాలు కోకొల్లలు.. ఈ పరిస్థితుల్లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370ని మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం  రద్దు చేసింది. లోయలో ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ పరిణామం శాంతిభద్రతల పరిస్థితిని మరింత దిగజార్చుతుందనే ఆందోళన అప్పట్లో వ్యక్తమైంది. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి..? మూడేళ్లుగా చేపట్టిన చర్యలు ఏ మేరకు ఫలించాయి? కశ్మీర్‌ ప్రస్తుతం ఎలా ఉందో పరిశీలించేందుకు ‘ఈనాడు’ అక్కడికి వెళ్లింది. అత్యంత సున్నితమైన ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా, పుల్వామా, బద్గాం, అనంతనాగ్‌ తదితర జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించింది. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) సమీపంలోని ప్రజలను పలకరించింది. ప్రస్తుతమైతే కశ్మీర్‌ కొంత కుదుట పడ్డట్టే కనిపించింది. అయినా, ప్రజల మనసుల్లో మాత్రం భయం తొలగిపోలేదు. టార్గెట్‌ కిల్లింగ్స్‌, హైబ్రిడ్‌ టెర్రరిజం, చొరబాట్ల ముప్పు భద్రతాదళాలకు సవాల్‌ విసురుతూనే ఉన్నాయి. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనమిది.

గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం కశ్మీర్‌ పర్యాటకులతో పోటెత్తుతోంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 1.62 కోట్ల మంది కశ్మీర్‌ సందర్శనకు వచ్చారు. అంటే రోజుకు 60 వేల మంది వస్తున్నారు. హోటళ్లలో ఆక్యుపెన్సీ రేటు 95 శాతానికి చేరింది. నాలుగేళ్ల క్రితం ఇది 30 శాతం కూడా లేదు. డిమాండు పెరగడంతో గదుల అద్దెలు 80 శాతం వరకూ పెంచారు. వారాంతాల్లో దిల్లీ నుంచి వస్తున్న విమానాల్లో టికెట్లు దొరకడం కష్టసాధ్యంగా మారింది. జమ్మూ నుంచి వస్తున్న పర్యాటక వాహనాల సంఖ్య గతంలో కంటే నాలుగైదు రెట్లు పెరిగింది. ‘ఇంత మంది పర్యాటకులను గతంలో ఎప్పుడూ చూడలేదు. చాలాకాలం తర్వాత నాలుగు డబ్బులు సంపాదిస్తున్నా’ అని దాల్‌ సరస్సులో చిన్న పడవ నడుపుకొనే  ఖుర్షీద్‌ నవ్వుతూ చెప్పారు.

మార్పు మంచిదే..

2019 మే 29న సోఫియాన్‌ జిల్లా గుగ్‌లోరా ప్రాంతంలోని ఓ ఇంట్లో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు దాగారన్న సమాచారంతో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. సైన్యంపై గ్రామస్థులు పెద్దఎత్తున రాళ్లదాడి మొదలుపెట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో 20 మంది గాయపడ్డారు. దీనికి ఒకరోజు ముందు కుల్గాం జిల్లా తాజిపోరా ప్రాంతంలో రాళ్లు రువ్వుతున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 50 మంది గాయపడ్డారు. 2016లో 2,653, 2017లో 1,412, 2018లో 1,458, 2019లో 1,999 రాళ్లు రువ్విన ఘటనలు నమోదు కాగా.. 2020లో అవి 250కే పరిమితమయ్యాయి. 2020 నుంచి ఇప్పటి వరకూ లోయలో కొన్ని వందల ఎదురుకాల్పులు జరగ్గా.. 600 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ, ఒక్క ఘటనలోనూ స్థానికులు భద్రతా బలగాలను నిలువరించే ప్రయత్నం చేయలేదు. స్థానికుల్లో మార్పునకు ఇదో నిదర్శనమని అక్కడి పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అంతేకాదు.. గతంతో పోల్చుకుంటే ఉగ్రవాదుల సమాచారం ఇచ్చేవారు కూడా పెరిగారన్నారు. గతంలో ఎవరైనా ఉగ్రవాది లొంగిపోతే స్వగ్రామంలో అతని కుటుంబాన్ని వెలివేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సదరు అధికారి వివరించారు.

ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు..

పర్యాటకం పరుగులు పెడుతున్నా.. స్థానికుల్లో మార్పు కనిపిస్తున్నా.. ఇవన్నీ నాణేనికి ఒక వైపే. అప్పుడప్పుడూ జరుగుతున్న టార్గెట్‌ కిల్లింగ్స్‌ ఒకింత ఆందోళన రేకెత్తిస్తూనే ఉన్నాయి. గతంలో లోయ నుంచి వెళ్లిపోయిన పండిట్లు తిరిగి రావాలని ఆర్టికల్‌ 370 ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు పండిట్లను లక్ష్యంగా చేసుకొని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ‘370’ రద్దు తర్వాత కశ్మీర్‌లో ఆరుగురు పండిట్లతో సహా మొత్తం 23 మందిని ఉగ్రవాదులు హతమార్చారు. మైనార్టీలు, కూలీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఈ దాడులు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. స్థానిక యువతపై ఉన్న కేసులు వారి అభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయి. ఇంకోవైపు ఎలాంటి నేర చరిత్రలేని, భావజాలం పట్ల ఆసక్తి ఉన్న స్థానికులను ఉగ్రచర్యలకు వినియోగిస్తున్న తీరు(హైబ్రిడ్‌ టెర్రరిజమ్‌) భద్రతాదళాలకు కునుకులేకుండా చేస్తోంది. ఇటువంటి వారిని గుర్తించడం కష్టంగా మారిందని చినార్‌కాప్స్‌ కోర్‌ కమాండర్‌ అమరీందర్‌సింగ్‌ ‘ఈనాడు’కు చెప్పారు.


బంద్‌లకు స్వస్తి..

కశ్మీర్‌లో ఏడాదిలో సగం రోజులు బంద్‌లు, హర్తాళ్లలోనే గడచిపోయేవి. ముఖ్యంగా 2017, 2018లలో విద్యాసంస్థలు పట్టుమని పది రోజులూ తెరచుకోలేదు. కానీ, గత మూడేళ్లలో ఇక్కడ ఒక్క రోజు కూడా బంద్‌ పాటించలేదంటే అతిశయోక్తి కాదు. మళ్లీ ఆందోళనలు ఎగదోయాలని ఎవరైనా ప్రయత్నించినా.. స్థానికుల నుంచి మద్దతు లభించడంలేదని శ్రీనగర్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. ‘‘గతంలో బంద్‌లకు పిలుపునిచ్చే వారికి విదేశీ నిధులు అందేవి. కానీ, బంద్‌ పాటించే మాకు ఆదాయం లేక కడుపు మాడేది’’ అని శ్రీనగర్‌ ఫ్రూట్‌ మార్కెట్‌లో వ్యాపారం చేసుకుంటున్న అబ్దుల్లా ‘ఈనాడు’కు తెలిపారు.


అభివృద్ధి కనిపిస్తోంది

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అభివృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా శాంతిభద్రతల పరిస్థితి మెరుగవడంతో వ్యాపారాలు పెరిగాయి. అయితే, మా గ్రామంలోనే 750 మంది యువకులపై కేసులు ఉన్నాయి. దాంతో వారికి ఉద్యోగాలే కాదు.. పాస్‌పోర్టులూ అందడంలేదు. ఇతర ప్రభుత్వ సాయానికీ వారు నోచుకోవడంలేదు. వీరిపై ఉన్న కేసులు ఎత్తివేయాలని చాలాసార్లు ప్రభుత్వాన్ని కోరాం. ఇలాంటి వారే విసిగిపోయి దారి తప్పుతున్నారు. అందుకే లోయలో ఇలాంటి వారిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలి. మరోవైపు ఒకప్పుడు ప్రభుత్వం కంటే హురియత్‌ జారీ చేసే ఆదేశాలే చెల్లేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా గ్రామంలో ఎన్నికలు జరిగి 37 సంవత్సరాలైంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాం.

-జావెద్‌ ఇక్బాల్‌, పలహాల్‌ గ్రామం, బారాముల్లా జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని