ఈసీ నియామకం.. 24 గంటల్లోనా!

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియామకం తీరుపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది.

Published : 25 Nov 2022 05:55 IST

సుప్రీంకోర్టు ఆక్షేపణ
అరుణ్‌ గోయల్‌ ఎంపిక ఫైళ్లను న్యాయస్థానానికి సమర్పించిన ఏజీ

దిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియామకం తీరుపై సుప్రీంకోర్టు పెదవి విరిచింది. గోయల్‌ నియామక ఫైళ్లను ‘మెరుపువేగం’తో ఆమోదించారంటూ విస్తుపోయింది. 24 గంటలు కూడా గడవక ముందే మొత్తం ప్రక్రియను ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి ‘కొలీజియం’ వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అరుణ్‌ గోయల్‌ నియామకంపై బుధవారం పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఆయన నియామక దస్త్రాలను తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించగా.. అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌.వెంకటరమణి కేంద్రం తరఫున గురువారం ఆ ఫైళ్లను కోర్టుకు సమర్పించారు. దస్త్రాలను పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రం తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందని.. నాటి నుంచి నవంబరు 18వ తేదీ వరకు ఏం జరిగిందో చెప్పాలని రాజ్యాంగ ధర్మాసనం ఏజీని నిలదీసింది. ఈ వ్యవహారంపై చేపట్టిన విచారణ, అనుమానాల నివృత్తి కోసం వేసే ప్రశ్నల ద్వారా కేంద్రానికి తాము వ్యతిరేకమని అర్థం చేసుకోవద్దని రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తెలిపారు.

* సుప్రీంకోర్టు ప్రశ్నలకు అటార్నీ జనరల్‌ స్పందిస్తూ ‘‘ఎన్నికల కమిషనర్‌ ఎంపిక ప్రక్రియలో ఎక్కడా తప్పు జరగలేదు. గతంలో కూడా 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలున్నాయి. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీవోపీటీ డేటాబేస్‌ నుంచే తీసుకున్నారు. ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. పేరు ఎంపిక సమయంలో సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్‌ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు’’ అని బదులిచ్చారు. పాలనలోని చిన్న చిన్న విషయాలను కూడా సమీక్షిస్తారా అనే ప్రశ్న సుప్రీం తీరుతో తలెత్తుతోందని ఏజీ అన్నారు. ఈ కేసులోని పూర్తి అంశాలను ధర్మాసనం పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా ఓ పిటిషనరు తరఫున వాదిస్తున్న న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం చేసుకొని ఏదో చెప్పబోగా.. ‘దయచేసి, మీరు కాసేపు ఆగండి’ అంటూ ఏజీ వారించారు. భారీ పరిశ్రమల శాఖలో కార్యదర్శిగా ఉన్న అరుణ్‌ గోయల్‌ పంజాబ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. నవంబరు 18న ఈయన స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా.. ఆ మరుసటి రోజే ఈసీ కమిషనరుగా నియామకం పొందారు. ఇదే బ్యాచ్‌కు చెందిన 160 మంది అధికారులు ఉన్నారని, ఇందులో యువత కూడా ఉన్నట్లు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.

తీర్పు రిజర్వులో ఉంచిన ధర్మాసనం..

ఎన్నికల సంఘంలో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి అంశంపై దాఖలైన పిటిషన్లపైన నాలుగు రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు అయిదు రోజుల గడువు ఇచ్చింది.


హడావుడిగా ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది

‘‘ఇదేం నియామకం? అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాలను మేము  ప్రశ్నించట్లేదు. నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. గోయల్‌ ఫైలును ఎందుకంత హడావుడిగా ఆమోదించాల్సి వచ్చింది? ఫైలు మొదలుపెట్టిన రోజే అపాయింట్‌మెంటు ఎలా సాధ్యమైంది? ఈసీ పదవి కోసం నలుగురి పేర్లను తుది జాబితాలో చేర్చిన న్యాయశాఖ నవంబరు 18న ఆ ఫైలును ప్రధాని కార్యాలయానికి పంపింది. అదే రోజున ప్రధాని ఒక పేరును ప్రతిపాదించారు. 24 గంటల్లో రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. ఇందులో నిర్ణీత ఆరేళ్ల పదవీకాలం ఉన్న పేరు ఒక్కటీ లేదు. అందరూ రిటైర్డ్‌ బ్యూరోక్రాట్లేనా? ఇతరులు లేరా? ప్రతిభావంతులైన యువ అధికారుల  మాటేమిటి? నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే.. అందరిలోకి చిన్నవాడైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? దీనికి అనుసరించిన పద్ధతి ఏమిటి?’’

 సుప్రీం ధర్మాసనం ప్రశ్నల వర్షం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని