దిల్లీ తరగతి గదుల నిర్మాణంలో రూ.1,300 కోట్ల కుంభకోణం!

ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వంపై మరో వివాదం ముసురుకుంది. ఆ ప్రభుత్వం చేపట్టిన పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల కుంభకోణం జరిగిందని, ఈ అక్రమాలపై ప్రత్యేక సంస్థతో దర్యాప్తు జరిపించాలని విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫార్సు చేసింది.

Published : 26 Nov 2022 05:02 IST

ప్రత్యేక సంస్థతో దర్యాప్తు జరిపించాలి
విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫార్సు

దిల్లీ: ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వంపై మరో వివాదం ముసురుకుంది. ఆ ప్రభుత్వం చేపట్టిన పాఠశాల తరగతి గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల కుంభకోణం జరిగిందని, ఈ అక్రమాలపై ప్రత్యేక సంస్థతో దర్యాప్తు జరిపించాలని విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసిన నివేదికలో ఈ విషయాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై వెంటనే స్పందించిన భాజపా నేతలు...విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోదియాను పదవి నుంచి తొలగించాలని, లేదంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) 2020 ఫిబ్రవరి 17వ తేదీతో రూపొందించిన నివేదికలో...దిల్లీ ప్రభుత్వం చేపట్టిన 2400 తరగతి గదుల నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని పేర్కొంది. ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. అదే నెలలో ఈ నివేదికను దిల్లీ ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్‌ డైరెక్టరేట్‌కు పంపించి, దాని అభిప్రాయం తెలపాలని కోరింది. అయితే, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా అడిగే వరకు కూడా విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ రెండున్నరేళ్ల పాటు ఆ నివేదిక గురించి నోరు మెదపలేదు. ఈ జాప్యానికి కారణమేమిటో దర్యాప్తు చేయాలని ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. రూ.1300 కోట్ల కుంభకోణంలో విద్య, ప్రజా పనుల విభాగాల అధికారుల ప్రమేయం ఉందని, అక్రమాలకు వారిని బాధ్యులను చేయాలని విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ సిఫార్సు చేసినట్లు సమాచారం.

కేజ్రీవాల్‌ ప్రభుత్వం టెండర్లు పిలవకుండానే ఓ నిర్మాణ సంస్థకు పనులను కట్టబెట్టిందని, మరుగుదొడ్లు నిర్మించి వాటిని తరగతి గదులుగా చూపారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా శుక్రవారం ఆరోపించారు. అవినీతికి పాల్పడిన విద్యా మంత్రిని తొలగించాలని, లేదంటే ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్‌ వైదొలగాలని డిమాండ్‌ చేశారు.

భాజపా ప్రధాన కార్యాలయం నుంచి ఓ కుట్రను రచించి దానిని మీడియాకు పంపించారని మనీశ్‌ సిసోదియా విమర్శించారు. ఆ నివేదికను విద్యాశాఖ మంత్రికి కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారని మీడియా వార్తల ద్వారా తెలుస్తోందన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, అభియోగాలు మోపడం వంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని