స్వాతంత్య్ర సమరంలో సామాన్యులపై పుస్తకం

దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం పోరాడిన అజ్ఞాత వీరుల జీవిత గాథలను నేటి తరానికి చాటి చెబుతూ ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ‘ది లాస్ట్‌ హీరోస్‌: ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం’ పేరుతో రాసిన పుస్తకాన్ని సోమవారం దిల్లీలో ఆవిష్కరించనున్నారు.

Published : 28 Nov 2022 03:32 IST

‘ది లాస్ట్‌ హీరోస్‌’ పేరుతో 15 మంది వీర గాథలు వెలుగులోకి
నేడు దిల్లీలో ఆవిష్కరణ

ఈనాడు, దిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం పోరాడిన అజ్ఞాత వీరుల జీవిత గాథలను నేటి తరానికి చాటి చెబుతూ ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ ‘ది లాస్ట్‌ హీరోస్‌: ఫుట్‌ సోల్జర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫ్రీడం’ పేరుతో రాసిన పుస్తకాన్ని సోమవారం దిల్లీలో ఆవిష్కరించనున్నారు. ఇందులో వీర వనిత మల్లు స్వరాజ్యంతోపాటు దేశంలో 15 మంది యోధుల జీవితాలను ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఉన్న పుస్తకాల్లో అట్టడుగు స్థాయిలో పోరాడిన అసలైన వీరుల గాథలు వినిపించలేదన్న అంశమే ఆయనను ఈ పుస్తక రచనకు ఉసిగొల్పింది. ఇప్పటివరకు చరిత్రలో నిక్షిప్తమైన స్వాతంత్య్ర సమరయోధుల పేర్లన్నీ అగ్రవర్ణాల వారివేనన్న వాదన ఉంది. అందుకే ఈ పుస్తకంలో దళితులు, ఆదివాసీలు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, రైతులు, కార్మికులు, వంటవాళ్లు, సాధారణ మహిళల గురించి వెలుగులోకి తీసుకొచ్చారు. స్వతంత్రతా సైనిక్‌ సమ్మాన్‌ యోజన పేరుతో ఉన్న పింఛను స్కీంలో స్వాతంత్య్ర సమరయోధుల గురించి చెప్పిన నిర్వచనం తప్పని, దానివల్ల నిజమైన సమరయోధులతోపాటు, మహిళలకు ఆ ప్రయోజనం దక్కలేదని సాయినాథ్‌ అంటారు. అందుకే ఈ పుస్తకంలోని మొత్తం 15 మందిలో అయిదుగురు మహిళలకు పెద్దపీట వేశారు. మరో అయిదేళ్లలో మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిలో ఒక్కరూ జీవించి ఉండే పరిస్థితి లేదు. ఇప్పటివరకూ చరిత్రపుటలకు ఎక్కనివారి గురించి నేటితరం మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఆ లోపాన్ని ఈ పుస్తకం ద్వారా సరిదిద్దే ప్రయత్నం సాయినాథ్‌ చేస్తున్నారు. ప్రస్తుత పుస్తకాల్లో స్వాతంత్య్రోదమం మొత్తం ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనే జరిగినట్లు అనిపిస్తుంది. అది నిజం కాదని ఈ పుస్తకం ద్వారా చాటుతున్నారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాది ప్రాంతాలకు చెందిన ఎంతోమంది స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న విషయాన్ని చెబుతున్నారు. దక్షిణాదిలో తెలంగాణకు చెందిన మల్లు స్వరాజ్యం, తమిళనాడుకు చెందిన ఎన్‌.శంకరయ్య, ఆర్‌.నల్లకన్నుల గురించి ఇందులో చెప్పారు. భగత్‌సింగ్‌ జుగ్గియాన్‌, బాజీ మొహమ్మద్‌, లక్ష్మి పండా, గణపతి యాదవ్‌, భాబని మహతో, హెచ్‌ఎస్‌ దొరెస్వామి లాంటివారి చరిత్రలకు అక్షరరూపం కల్పించారు. ఎన్నో ఏళ్లపాటు బ్రిటిష్‌ జైళ్లలో మగ్గిన తాత వీవీ గిరిని చూడటానికి సామాన్యులు వచ్చినప్పుడు అసలు వీరులు వీరేనని ఆయన చిన్ననాడు చెప్పిన మాటలే సాయినాథ్‌ను ఈ పుస్తక రచనకు ఉసిగొల్పాయి. ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఎలా ఎదుర్కొన్నారు, కులమతాలకు అతీతంగా ఎలా ఎదిగారన్నది చెప్పడమే ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని