బల్లార్ష రైల్వేస్టేషన్‌లో కూలిన పాదచారుల వంతెన

మహారాష్ట్రలోని బల్లార్ష రైల్వేస్టేషన్‌లో పాదచారుల వంతెన పాక్షికంగా కూలింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.

Published : 28 Nov 2022 04:23 IST

మహిళ మృతి.. 12 మందికి గాయాలు

బల్లార్ష, న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని బల్లార్ష రైల్వేస్టేషన్‌లో పాదచారుల వంతెన పాక్షికంగా కూలింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం 5.10 గంటల సమయంలో 4వ నంబరు ప్లాట్‌ఫాంపైకి పుణె వెళ్లే రైలు వస్తుందన్న ప్రకటనతో.. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో 1వ నంబరు నుంచి అక్కడకు వెళ్లేందుకు ఈ వంతెన ఎక్కారు. ఆ సమయంలో ఒక్కసారిగా వంతెనలో కొంతభాగం కూలిపోయింది. ఆ ప్రదేశంలో ఉన్న 13 మంది ప్రయాణికులు.. దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి పట్టాలపై పడిపోయారు. దీంతో కొందరికి తలకు గాయాలు కాగా.. మరికొందరి కాళ్లు, చేతులు విరిగాయి. వంతెన కూలిన ప్రదేశంలో కరెంటు తీగలు లేకపోవడం, ఆ సమయంలో పట్టాలపై రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. క్షతగాత్రులను చంద్రపూర్‌ జిల్లా ఆసుపత్రికి, ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 48 ఏళ్ల నీలిమా రంగరి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో అయిదుగురు చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారికి చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ రెండు పాదచారుల వంతెనలు ఉండగా.. పాత వంతెనపై ప్రీ కాస్ట్‌ స్లాబ్‌ కొంత భాగం కూలడంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని