పోలీసుల దుశ్చర్య.. కాళ్లు పోగొట్టుకున్న చిరు వ్యాపారి

వారంతా నిరుపేదలు. ఏవో చిరువ్యాపారాలు చేస్తూ బతుకుబండి లాగుతుంటారు. అలాంటి వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు.

Updated : 04 Dec 2022 05:51 IST

వారంతా నిరుపేదలు. ఏవో చిరువ్యాపారాలు చేస్తూ బతుకుబండి లాగుతుంటారు. అలాంటి వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ‘‘ఈ స్థలం మీది కాదు..వెంటనే ఖాళీ చేయండి’’ అంటూ హుకుం జారీ చేశారు. ఎదిరించి మాట్లాడిన వ్యక్తిపై చేయి చేసుకున్నారు. అతడి తక్కెడను రైల్వే ట్రాక్‌పైకి విసిరేశారు. తిరిగి తెచ్చుకునేందుకు వెళ్లిన చిరు వ్యాపారిని అటువైపుగా వస్తున్న రైలు ఢీ కొట్టడంతో అతడు రెండు కాళ్లూ కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కాన్పుర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో కొందరు వ్యక్తులు చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారిని ఖాళీ చేయించేందుకు శుక్రవారం ఉదయం ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అడ్డుపడిన అర్సలాన్‌ (18) అనే యువకుడిపై చేయి చేసుకున్నారు. అర్సలాన్‌ త్రాసును హెడ్‌ కానిస్టేబుల్‌ రాకేశ్‌ రైల్వే ట్రాక్‌పైకి విసిరేశాడు. దీంతో కంగారు పడిన అర్సలాన్‌ దానిని తిరిగి తెచ్చుకునేందుకు వెళ్లాడు. అంతలోనే ఎదురుగా వస్తున్న రైలు ఢీ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నుజ్జునుజ్జయిన అతడి రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవడంతో ఉన్నతాధికారులు రాకేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని