టీచర్‌ను అప్పులపాలు చేసిన ఆశ

ఆశ.. ఓ ఉపాధ్యాయుడిని అప్పుల పాలు చేసింది. పరిచయం లేని వ్యక్తి నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పార్సిల్‌ వచ్చిందనే సంతోషంతో.. కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు.

Updated : 04 Dec 2022 09:46 IST

విదేశీ బహుమతి పేరుతో రూ.కోటిన్నర సమర్పించుకున్న ఉపాధ్యాయుడు

ఆశ.. ఓ ఉపాధ్యాయుడిని అప్పుల పాలు చేసింది. పరిచయం లేని వ్యక్తి నుంచి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పార్సిల్‌ వచ్చిందనే సంతోషంతో.. కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు. ఆ పార్సిల్‌ తీసుకోవడం కోసం.. క్రమంగా దాదాపు రూ.1.85 కోట్లు చెల్లించాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రాజధాని లఖ్‌నవూలోని త్రివేణి నగర్‌లోని మాదేయ్‌గంజ్‌లో నివాసం ఉండే నవీన్‌ శామ్యూల్‌ సింగ్‌(53) టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 4న ఆయనకు ఓ కాల్‌ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి.. తనను ముంబయి కంపెనీ విల్టన్‌ ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్స్‌ డైరెక్టర్‌ జాన్‌ స్పెన్సర్‌గా పరిచయం చేసుకున్నాడు. తనది పోలండ్‌ అని వెల్లడించాడు. నవీన్‌కు పోలాండ్‌ నుంచి ఓ పార్సిల్‌ వచ్చినట్లు.. అందులో ఖరీదైన బ్రాండ్‌ వాచ్‌, నెక్లెస్‌, బ్రేస్‌లెట్‌, మొబైల్‌ ఫోన్‌, యాపిల్‌ నోట్‌ ప్యాడ్‌, ఓ సెంటు సీసా, ఓ టీ షర్ట్‌ ఉన్నట్లు తెలిపాడు. నవీన్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించగా.. క్రైస్తవం గురించి మీరు చేసిన కొన్ని వీడియోలు చూసి బహుమతులు పంపినట్లు కేటుగాళ్లు చెప్పారు. దీంతో నవీన్‌ రూ.38వేలతో ప్రారంభించి దఫదఫాలుగా రూ.1,85,62,887 చెల్లించాడు. ఇందుకోసం బ్యాంకులో ఆప్పులు సైతం తీసుకున్నాడు. తాను దాచుకొన్న మొత్తం, అప్పులు చేసిన మొత్తం అయిపోవడంతో.. ఇంక చెల్లింపులు చేయలేనని వేడుకున్నాడు. అయినా కనికరించని జాన్‌.. రూ.4.5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని