కశ్మీరంలో ప్రగతి సమీరం

ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని దశాబ్దాలపాటు విలవిల్లాడిన కశ్మీర్‌ లోయ క్రమంగా ఊపిరిపీల్చుకుంటోంది.

Updated : 06 Dec 2022 11:45 IST

మూడంచెల వ్యూహంతో ముందుకెళ్తున్న కేంద్రం
యువత ఉగ్రవాదంవైపు ఆకర్షితులవకుండా చర్యలు
నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడుల వెల్లువ
చల్లా విజయభాస్కర్‌
కశ్మీర్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని దశాబ్దాలపాటు విలవిల్లాడిన కశ్మీర్‌ లోయ క్రమంగా ఊపిరిపీల్చుకుంటోంది. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా వీస్తున్న ప్రగతి సమీరాలతో సాంత్వన పొందుతోంది. ఒకప్పుడు విద్రోహశక్తుల వైపు ఆకర్షితులైన స్థానిక యువత.. నేడు క్రీడలు, కెరీర్‌పై దృష్టిసారిస్తూ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటోంది.

ముష్కర మూకల విధ్వంసకాండతో అభివృద్ధికి దూరమైన జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని 2019 ఆగస్టులో కేంద్రప్రభుత్వం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌) విభజించింది. నాటినుంచి వాటి పాలనా వ్యవహారాలను నేరుగా పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాద ప్రభావం అత్యధికంగా ఉండే కశ్మీర్‌ లోయపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. మూడంచెల వ్యూహాన్ని అమలుచేస్తూ ఆ ప్రాంతాన్ని ప్రగతి బాట పట్టిస్తోంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, ఆ రక్కసి వైపు యువత మళ్లకుండా చూడటం, ముష్కర ప్రభావిత ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు ప్రాధాన్యమివ్వడం ఈ వ్యూహంలో భాగాలు.


అవినీతికి అడ్డుకట్ట

కశ్మీర్‌ అభివృద్ధికి కంకణం కట్టుకున్న కేంద్రం.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ద్వారా తన వ్యూహాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలుచేస్తోంది. స్థానిక పాలనా వ్యవస్థలో అవినీతి నిర్మూలనపై తొలుత దృష్టిపెట్టిన సిన్హా ‘సతర్క్‌ నాగరిక్‌’ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దానిద్వారా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీచేశారు. యాప్‌లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి 105 మంది ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారు. ఉద్యోగులు ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించడాన్ని సిన్హా తప్పనిసరి చేశారు. ఖాళీల భర్తీకి నిర్దిష్ట నియామక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో అర్హులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ పనుల నిర్వహణ కోసం టెండర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం కూడా పాలనలో పారదర్శకతను పెంచింది. 2019 నుంచి జమ్మూకశ్మీర్‌లో 29,813 పోస్టులను భర్తీచేశారు. ప్రస్తుతం 1,087 గెజిటెడ్‌, 4436 నాన్‌గెజిటెడ్‌ పోస్టులు, 3,175 క్లాస్‌-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టారు.


పెరిగిన ప్రైవేటు పెట్టుబడులు

జమ్మూకశ్మీర్‌లో పాలనాయంత్రాంగం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని రూపొందించి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి జోన్‌లవారీగా వివిధ రకాల ప్రోత్సాహకాలిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.55 వేలకోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో రూ.34,454 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 3,379 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని.. 19,961 కనాల్‌ల భూమిని (8 కనాల్‌ = 1 ఎకరం) కేటాయించింది. దీనివల్ల కొత్తగా 1,59,781 ఉద్యోగాలు వస్తాయన్నది అంచనా. నూతన పారిశ్రామిక విధానం కింద దరఖాస్తు చేసుకున్నవారికి 75 రోజుల్లో ఆన్‌లైన్‌ ద్వారానే భూకేటాయింపులు పూర్తిచేస్తున్నారు. ప్లాంట్‌ అండ్‌ మిషనరీపై 400% ప్రోత్సాహకం అందిస్తున్నారు. దీనివల్ల యాపిల్‌ అత్యధికంగా పండే పుల్వామా జిల్లాలో వాటి శుద్ధి-నిల్వకు సంబంధించిన ఆధునిక పరిశ్రమలు భారీగా వచ్చాయి. పెన్సిళ్ల తయారీకి ముడిసరకును దేశమంతటికీ పంపే ఈ జిల్లాలో కొత్తగా పెన్సిల్‌ తయారీ పరిశ్రమలు, పొరుగున ఉన్న అనంతనాగ్‌ జిల్లాలో క్రికెట్‌ బ్యాట్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.


కుంకుమపువ్వు రైతుల ఆదాయం రెట్టింపు

ప్రపంచంలోకెల్లా అత్యంత శ్రేష్ఠమైన కుంకుమపువ్వు కశ్మీర్‌లోని పామ్‌పుర్‌లో పండుతోంది. దాని ప్రాసెసింగ్‌ కోసం ప్రభుత్వం ఇక్కడ కొత్తగా రూ.37 కోట్లతో శుద్ధిపరిశ్రమను ఏర్పాటుచేసింది. రైతులు తాము పండించిన కుంకుమపువ్వును ఇక్కడికి తీసుకొచ్చి నిల్వ, శుద్ధి చేసుకోవచ్చు. ఇక్కడినుంచే ఈ-మార్కెటింగ్‌ ద్వారా విక్రయాలూ జరపొచ్చు. ఈ సదుపాయాలన్నింటినీ పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. గతంలో కుంకుమపువ్వును సంప్రదాయ పద్ధతుల్లో ఎండబెట్టడానికి నాలుగైదు రోజులు పట్టేది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక వ్యవస్థలో ఆ పని 30 నిమిషాల్లో పూర్తవుతోందని పుల్వామా జిల్లా కలెక్టర్‌ బషీర్‌ ఉల్‌హక్‌ చౌధరి తెలిపారు. పూల రంగు, వాసన తాజాగా ఉంటుండటంతో వాటికి ధర అధికంగా పలుకుతోందని పేర్కొన్నారు. గతంలో ఒక్కో గ్రాము కుంకుమపువ్వును రూ.100కు అమ్మిన రైతులు ప్రస్తుతం రూ.205-230 వరకు విక్రయిస్తున్నారని, వారి ఆదాయం రెట్టింపయిందని చెప్పారు.


క్యూఆర్‌ కోడ్‌తో పాస్‌పుస్తకాలు

రైతులకు భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడానికి వందల ఏళ్లనాటి భూ రికార్డులన్నింటినీ డిజిటలైజ్‌ చేశారు. క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పాస్‌పుస్తకాలను వారికి అందిస్తున్నారు. ఇప్పటివరకు 12.40 లక్షలమంది రైతులకు అవి అందాయి. న్యాయవ్యవస్థ పరిధిలో ఉండే భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కొత్తగా ఏర్పాటుచేసిన రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. తద్వారా రిజిస్ట్రేషన్‌ వ్యవహారం సరళతరమైంది.


ప్రతి పంచాయతీ పరిధిలో క్రీడామైదానం

వేర్పాటువాద భావజాలంవైపు పిల్లలు ఆకర్షితులవకుండా స్థానిక పాలనాయంత్రాంగం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఆటలపై వారు దృష్టిసారించేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపుగా ప్రతి పంచాయతీ పరిధిలో ఓ క్రీడామైదానాన్ని అభివృద్ధి చేసింది. పలు నగరాల్లోని స్టేడియంలలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసింది. హాకీ కోసం అత్యాధునిక సింథటిక్‌ టర్ఫ్‌ కోర్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక కోచ్‌లతో మెరుగైన శిక్షణనిప్పిస్తోంది. ఫలితంగా విద్యార్థులు వేర్పాటువాదంవైపుగానీ, మాదకద్రవ్యాలవైపుగానీ వెళ్లకుండా నిలువరించడం సులభంగా మారింది. తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న పుల్వామాలో.. చిన్నప్పటి నుంచే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం 50 సీట్లతో ప్రత్యేక థియేటర్‌ను నిర్మించింది. దేశానికి విభిన్న రంగాల్లో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన వారి జీవితగాథలను, సినిమాలను చిన్నారుల కోసం ఇందులో ప్రదర్శిస్తున్నారు. వారిలో స్ఫూర్తి నింపుతున్నారు.


ఎయిమ్స్‌ నిర్మాణంలో తెలుగు ముద్ర

కశ్మీర్‌ ప్రజలకు మెరుగైన వైద్య వసతులను కల్పించడంలో తెలుగువారు కూడా ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉగ్రవాద కేంద్రంగా పేరొందిన పుల్వామా జిల్లా అవంతిపురలో కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌ను నిర్మిస్తున్నది తెలుగు రాష్ట్రాలకు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీయే. ప్రతికూల వాతావరణాన్ని, శాంతిభద్రతల విషయంలో నెలకొన్న భయాలను పక్కనపెట్టి సుమారు వంద మంది తెలుగు ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఇక్కడ ఎయిమ్స్‌ సంబంధిత 57 భవనాల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. వాటి విస్తీర్ణం 2,34,658 చదరపు మీటర్లుగా ఉండనుంది. నిర్మాణానికి అయ్యే వ్యయం రూ.1,649.37 కోట్లు. అవంతిపురలో భూకంప ముప్పు అధికం. అందుకే ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు వెయ్యిమందికిపైగా కూలీలు ఇక్కడ పనిచేస్తున్నారు. 2024 మే నాటికల్లా ఎయిమ్స్‌ నిర్మాణం పూర్తయ్యే అవకాశాలున్నాయి. పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ ఈ ఆసుపత్రిని మెడికల్‌ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణ పనుల్లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం బాగా సహకరిస్తోందని ఇక్కడి పనులను పర్యవేక్షిస్తున్న నాగార్జున సంస్థకు చెందిన వెంకటరామయ్య పేర్కొన్నారు. ఇప్పటివరకు భద్రతాపరమైన సమస్యలేవీ ఎదురుకాలేదన్నారు. జమ్మూ డివిజన్‌లోని విజయ్‌పుర్‌లో ఓ ఎయిమ్స్‌ ఇప్పటికే ప్రారంభమైంది. అవంతిపురలోనూ నిర్మాణం పూర్తయితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ (రాయ్‌బరేలీ, గోరఖ్‌పుర్‌) తర్వాత రెండు ఎయిమ్స్‌లను కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్‌ ఘనత సాధిస్తుంది.


వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి

జమ్మూకశ్మీర్‌లో వైద్యపరమైన మౌలికవసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తోంది. ఇందులోభాగంగా కొత్తగా 7 వైద్య కళాశాలలు, 15 నర్సింగ్‌ కాలేజీలు, రెండు క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లను నిర్మిస్తోంది. జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా 140 వైద్యసంస్థల ఆధునికీకరణ, పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.881 కోట్లు కేటాయించింది. ప్రధానంగా విద్య, వైద్యం ప్రతిఒక్కరికీ అందుబాటులోకి వస్తే సమాజంలో శాంతియుత వాతారవణానికి బీజం పడినట్లేనని కేంద్రం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని