శీతాకాలంలో వాడీవేడి
దేశ సరిహద్దుల భద్రత అంశంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి.
నేటి నుంచి 29 వరకు పార్లమెంటు సమావేశాలు
అధిక ధరలు, నిరుద్యోగం, సరిహద్దు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్న విపక్షాలు
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారంటూ అఖిలపక్ష భేటీలో ధ్వజమెత్తిన ప్రతిపక్ష పార్టీలు
ఈనాడు - దిల్లీ
దేశ సరిహద్దుల భద్రత అంశంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమయ్యాయి. బుధవారం నుంచి ప్రారంభంకానున్న శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. మొత్తం 23 రోజుల వ్యవధిలో ఉభయ సభలు 17 దఫాలు భేటీకానున్నాయి. 16 కొత్త వాటితో సహా 25 బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా కీలకమైన మూడు బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది. దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న మహిళల రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పించాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. సభా కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ప్రధాన మంత్రి హాజరవడం సంప్రదాయం కాగా తాజా భేటీకి రక్షణ మంత్రి, లోక్సభలో భాజపా పక్ష ఉపనేత రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. రాజ్యసభాపక్ష నేత పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. రెండు గంటల పాటు కొనసాగిన భేటీకి 30కిపైగా పార్టీల నేతలు విచ్చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలను పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు సూచించాయి. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్ పేర్కొంది. ప్రతిపక్షాలు ప్రస్తావించే ఏ అంశంపైనైనా నిబంధనలకు లోబడి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సభా వ్యవహారాల సంఘం(బీఏసీ) భేటీల్లో అంగీకరించిన వాటిపై ఉభయ సభల్లో చర్చ జరుగుతుందన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోపరుస్తోందని కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ ప్రతినిధులు విమర్శించారు. అయితే, వాటిని అధికార భాజపా తోసిపుచ్చింది. కశ్మీర్ పండిట్లపై హింసాత్మక ఘటనలతో వారు జమ్మూకశ్మీర్ నుంచి పారిపోవాల్సి వస్తోందని కాంగ్రెస్ నేత అధీర్రంజన్ చౌధురి వెల్లడించారు.
క్రిస్మస్ను విస్మరించి సమావేశాల నిర్వహణా!
దేశంలో క్రిస్టియ్లన్లకూ పండుగ ఉంటుందని, దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం పట్ల అధీర్రంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వాదనను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు.ఎన్నికలే ప్రజాస్వామ్య పండుగలని పేర్కొన్నారు. రెండు ప్రధాన రాష్ట్రాల ఎన్నికలను దృష్ట్యా సమావేశాలను ఈ నెల 7 నుంచి 29వరకు ఖరారు చేసినట్లు చెప్పారు. 24న శనివారం, 25న ఆదివారం కాబట్టి ఆ రెండు రోజుల్లో పార్లమెంటు ఉండదని, అందరూ క్రిస్మస్ చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ నేతలు 26వ తేదీ కూడా సెలవు కావాలని కోరితే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెరపైకి మహిళా రిజర్వేషన్ బిల్లు
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు మంగళవారం నాటి సమావేశాల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో బీజేడీ నేత సస్మిత్ పాత్ర మాట్లాడుతూ శీతాకాల భేటీల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కోరగా టీఎంసీ, కాంగ్రెస్, ఎన్సీపీ, తెరాస నేతలు మద్దతు పలికారు. ఆ తర్వాత లోక్సభ సభాపతి ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలోనూ టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ ఈ అంశాన్ని ప్రస్తావించగా డీఎంకే, జేడీ(యు), శిరోమణి అకాలీదళ్ నేతలు సమర్థించారు. బిల్లుపై ఏకాభిప్రాయానికి అఖిల పక్ష భేటీ నిర్వహించాలన్నారు. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన జేడీ(యు) ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్