ఎన్నికలను అడ్డుకోలేం: సుప్రీం

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు పవిత్రత ఉందని, ఎన్నికల ప్రక్రియను స్తంభింపజేయడం సాధ్యపడదని సుప్రీంకోర్టు బుధవారం ఉద్ఘాటించింది.

Published : 08 Dec 2022 04:40 IST

దిల్లీ: ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు పవిత్రత ఉందని, ఎన్నికల ప్రక్రియను స్తంభింపజేయడం సాధ్యపడదని సుప్రీంకోర్టు బుధవారం ఉద్ఘాటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ సదర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 5న ఉప ఎన్నిక జరిగింది. పోలింగ్‌ రోజున పోలీసులు ప్రజలను చితగ్గొట్టి ఇళ్లకు బందీ చేశారనీ, వారిని ఓట్లు వేయనివ్వలేదని ఒక న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ నియోజక వర్గ ఓటరునైన తాను ఈ దారుణాన్ని కళ్లారా చూశానని, తాను కూడా పోలీసుల చేతిలో దౌర్జన్యానికి గురయ్యానని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో పోలైన ఓట్లను గురువారం లెక్కిస్తారు. పోలీసుల దుశ్చర్యపై తాను వ్యక్తిగతంగా పెట్టిన అర్జీని వెంటనే విచారించి, గురువారం నాటి ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని న్యాయవాది కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం అందుకు నిరాకరించింది. పవిత్రమైన ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. న్యాయవాది వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారే తప్ప నియమ నిబంధనల ప్రకారం పిటిషన్‌ దాఖలు చేయలేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని గురువారం ఉదయం మళ్లీ లేవనెత్తాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని