గిల్గిత్‌, పీఓకేలు భారత భూభాగాలే: రాజ్‌నాథ్‌

గిల్గిత్‌ బాల్టిస్థాన్‌, పీఓకే రెండూ భారత్‌లోని భూభాగాలే అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అదేవిధంగా చైనా ఆర్మీ భారత భూభాగంలోకి ప్రవేశించిందంటూ కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలు.. నిరాధారమైనవంటూ వాటిని తప్పుబట్టారు.

Updated : 02 Nov 2020 20:09 IST

దిల్లీ: గిల్గిత్‌ బాల్టిస్థాన్‌, పీఓకే రెండూ భారత్‌లోని భూభాగాలే అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. అదేవిధంగా చైనా ఆర్మీ భారత భూభాగంలోకి ప్రవేశించిందంటూ కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలు.. నిరాధారమైనవంటూ వాటిని తప్పుబట్టారు. అంతేకాకుండా భారత్‌, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులు భారత అదుపులోనే ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ఇండియాటుడే ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి మన అదుపులోనే ఉంది. చైనా ఆర్మీ మన భూభాగంలోకి ప్రవేశించినట్లు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. చైనాతో కమాండర్‌ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. కానీ వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందో మనకు తెలియదు. కానీ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. గల్వాన్‌ వివాదం తర్వాత నేను, ప్రధాని మోదీ సైనికులను కలిశాం. అక్కడి పరిస్థితుల్ని చూసిన తర్వాత నేను చెప్పేదేంటంటే ఒక్కరు కూడా మన భూభాగంలోకి చొరబడే ప్రసక్తే లేదు ’అని అన్నారు.

పాక్‌ ప్రభుత్వం గిల్గిత్‌ బాల్టిస్థాన్‌కు ప్రావిన్షియల్‌ హోదా కల్పిస్తూ మార్పులు చేయడం పట్ల ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌పై రాజ్‌నాథ్‌ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి ఆ దేశం గందరగోళానికి గురవుతోందన్నారు. ‘గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ సహా పీఓకే భారత్‌కు చెందిన ప్రాంతాలు. వాటి విషయంలో ఎలాంటి మార్పులు చేసినా అంగీకరించేది లేదు. పుల్వామా దాడికి పాకిస్థానే కారణమని ఇటీవల ఆ దేశ మంత్రే అంగీకరించారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న విషయంలో ప్రత్యేక ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌)తప్పనిసరిగా పాక్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చాలి’అంటూ రాజ్‌నాథ్‌ పాక్‌పై నిప్పులు చెరిగారు. 

గిల్గిత్‌ బాల్టిస్థాన్‌కు హోదా మార్చిన పాక్‌..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని