FabiSpray: కొవిడ్‌ చికిత్స.. అందుబాటులోకి తొలి నాజల్‌ స్ప్రే..!

కొవిడ్‌-19 బాధితులకు చికిత్సలో భాగంగా భారత్‌లో తొలి నాజల్‌ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబయి కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ ‘ఫాబిస్ప్రే’ (FabiSpray) పేరుతో దీనిని విడుదల చేసింది.

Updated : 09 Feb 2022 16:03 IST

విడుదల చేసిన గ్లెన్‌మార్క్‌ ఫార్మా

ముంబయి: కొవిడ్‌-19 బాధితులకు చికిత్సలో భాగంగా భారత్‌లో తొలి నాజల్‌ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబయి కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ ‘ఫాబిస్ప్రే’ (FabiSpray) పేరుతో దీనిని విడుదల చేసింది. కొవిడ్‌-19తో బాధపడుతున్న వయోజనులకు ఈ స్ప్రేను అందించవచ్చని తెలిపింది. కెనడాకు చెందిన సనోటైజ్‌ ఫార్మా సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాజల్‌ స్ప్రేను భారత్‌లో తయారీ, మార్కెట్ చేసుకునేందుకు గ్లెన్‌మార్క్‌ ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

‘ఈ నాజల్‌ స్ప్రే తీసుకున్న 24గంటల్లో 94శాతం వైరల్‌ లోడ్‌ తగ్గుతుండగా, 48 గంటల్లో 99శాతం తగ్గుతున్నట్లు భారత్‌లో జరిపిన మూడోదశ ప్రయోగాల్లో వెల్లడైంది. ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాజల్‌ స్ప్రే సురక్షితమే కాకుండా కొవిడ్‌ బాధితులకు ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తడం లేదు. ఫాబిస్ప్రే పేరుతో దీన్ని మార్కెట్‌లోకి అందుబాటులోకి తెస్తున్నాం’ అని గ్లెన్‌మార్క్‌ ఫార్మా సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ముక్కుద్వారా తీసుకున్నప్పుడు వైరస్‌ను అడ్డుకోవడంలో భౌతికంగా, రసాయనంగా ఇది దోహదం చేస్తుందని తెలిపింది. కొవిడ్‌-19కు కారణమైన వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరకముందే శ్వాసకోస మార్గం ప్రవేశంలోనే నిర్మూలించే లక్ష్యంతోనే ఫాబిస్ప్రేను అభివృద్ధి చేశామని గ్లెన్‌మార్క్‌ వెల్లడించింది.

‘తుదిదశ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వైరల్‌ లోడ్‌ తగ్గించడంతోపాటు కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకోవడంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నాజల్‌ స్ప్రే ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది’ అని గ్లెన్‌మార్క్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోనికా టాండన్‌ పేర్కొన్నారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టాతో ఎప్సిలాన్‌ వంటి వేరియంట్లను ఈ నాజల్‌ స్ప్రే కొన్ని నిమిషాల్లోనే నాశనం చేస్తున్నట్లు అమెరికాలోని యూటా స్టేట్‌ యూనివర్సిటీలో జరిపిన ప్రయోగాల్లో తేలిందని గుర్తుచేశారు.

మరోవైపు ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం ఈ నాజల్‌ స్ప్రే తుది దశ ప్రయోగాలను భారత్‌లోనూ చేపట్టారు. దేశవ్యాప్తంగా 20చోట్ల 306 మంది కొవిడ్‌ బాధితులపై నిర్వహించి ఫలితాలను విశ్లేషించారు. వీటిలోనూ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాజల్‌ స్ప్రే సురక్షితమని తేలడంతో కొవిడ్‌ చికిత్సలో వినియోగించేందుకు డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. దీంతో తాజాగా ఈ ఔషధాన్ని గ్లెన్‌మార్క్‌ సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని