30 లక్షలు దాటిన కొవిడ్ మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి మంగళవారం నాటికి 30 లక్షల మందికి పైగా మృత్యు ఒడికి చేరినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మరోసారి కరోనా మరణాల్లో

Published : 07 Apr 2021 01:28 IST

ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి బ్రెజిల్‌లోనే

లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విశ్వరూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి మంగళవారం నాటికి 30 లక్షల మందికి పైగా మృత్యు ఒడికి చేరినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మరోసారి కరోనా మరణాల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఆ జాబితాలో బ్రెజిల్, భారత్ ముందువరుసలో ఉన్నాయి. లాక్‌డౌన్లు, కఠిన ఆంక్షలతో ప్రజల్లో వచ్చిన విసుగు వల్ల యూకే, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో తాజాగా కొత్త కరోనా రకాలు విజృంభిస్తున్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 

గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మరణాలు నమోదు కావడానికి ఏడాది పడితే, మిగతా పది లక్షల మరణాలు మూడు నెలల్లోనే సంభవించాయి. ప్రస్తుతం బ్రెజిల్‌లో భారీగా మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి బ్రెజిల్‌లోనే ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా బ్రెజిల్‌ క్లిష్ట పరిస్థితుల్లోకి జారిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. ‘అక్కడ చాలా తీవ్రమైన పరిస్థితి నెలకొంది. చాలా రాష్ట్రాల్లో పరిస్థితి చేయిదాటింది. ఆస్పత్రుల్లోని ఐసీయూలు 90 శాతం నిండిపోయి ఉన్నాయి’ అని ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్‌లో కూడా కరోనా పగ్గాలు లేకుండా విస్తరిస్తోంది. సోమవారం కొత్త కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది. అమెరికా తర్వాత ఆ స్థాయిలో రోజువారీ కేసులు భారత్‌లోనే నమోదవ్వడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తాజాగా 96,982 మందికి కరోనా సోకింది. కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే ఎప్పుడు లేనంతగా రికార్డు స్థాయిలో 55,469 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షల వైపు మొగ్గు చూపింది. మాల్స్, సినిమా హాల్స్‌, బార్లు, రెస్టారెంట్ల మూసివేతకు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.

ఇప్పటివరకు అమెరికాలోనే అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఐదు లక్షల మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల్లో అమెరికా వాటా 19 శాతం. కొద్ది రోజులుగా అక్కడ కేసులు పెరుగుతున్నా అధికారులు మాత్రం టీకాలు తమను రక్షిస్తాయని, మరణాలను కట్టడి చేస్తాయని భావిస్తున్నారు. మరోవైపు పేద దేశాలకు టీకాలు పంపిణీ చేయడానికి సహకరించాలని ఆరోగ్యసంస్థ ధనికదేశాలను అభ్యర్థిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని