అందుకే భారత్‌లో కరోనా మరణాలు తక్కువ!

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వైరస్‌ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.

Published : 30 Aug 2020 01:52 IST

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వైరస్‌ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తక్కువ స్థాయిలో ఏసీల వాడకం, ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా సౌలభ్యం.. వైరల్‌ లోడ్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని ఏసియా పసిఫిక్‌ జర్నల్ ఆఫ్ పబ్లిక్‌ హెల్త్‌లో ప్రచురితమైన కథనం పేర్కొంది. అవి భారత్‌ సహా ఆసియా దేశాల్లో తక్కువ సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నాయని దిల్లీ, మంగళూరుకు చెందిన వైద్య నిపుణులు విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. 

‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు పూర్తిగా మూసి ఉన్న ఏసీ గదుల్లో చాలా తక్కువ సమయం గడుపుతారు. ఇది ఆసియా దేశాల్లో తక్కువ సంఖ్యలో కరోనా మరణాలకు కారణం కావొచ్చు. ఐరోపా దేశాల్లో మొదట్లో కేసుల సంఖ్య  చాలా అధికంగా ఉంది. జనవరి, ఫిబ్రవరిలో అక్కడి వాతావరణం చలిగా ఉండటంతో వారు ఎక్కువగా మూసిఉన్న గదులకే పరిమితమై ఉండి ఉండొచ్చు’ అని సర్‌ గంగారామ్ ఆంకాలజీ విభాగం ఛైర్మన్‌ డాక్టర్‌ శ్యామ్ అగర్వాల్ వెల్లడించారు. కాకపోతే భారత్‌లో ఒకే ఇంట్లో ఎక్కువమంది నివసించడం వల్ల కుటుంబాల్లో  వైరస్‌ వ్యాప్తికి దోహదం చేస్తుందన్నారు. 

కాగా, గాలి, వెలుతురు తగినంతగా లేని, రద్దీ గదుల్లో వైరస్‌ సోకిన వ్యక్తులతో ఉండటం వల్ల గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ జులైలో హెచ్చరించింది. మూసి ఉన్న, పూర్తిగా ఏసీతో నింపేసిన భవనాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నప్పటికీ, అవి మరణాల సంఖ్య పెరుగుదలకు కారణమవుతున్నాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని