Google: ఈయూ ముందు తలొగ్గిన దిగ్గజం

గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి యూరోపియన్ యూనియన్ చెక్ పెట్టింది. మిగిలిన సెర్చ్‌ ఇంజిన్‌లనూ ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంచాలన్న ఐరోపా ఆదేశానికి గూగుల్ తలొగ్గింది....

Published : 13 Jun 2021 21:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాలంలో ఏది వెతకాలన్నా ముందుగా గుర్తుచ్చేది గూగుల్ సెర్చ్‌ ఇంజిన్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ పరికరాల్లో 100కు 90 శాతం గూగుల్ సెర్చ్‌ ఇంజినే ఉంటుంది. ఈ ఏకఛత్రాధిపత్యానికి యూరోపియన్ యూనియన్ చెక్ పెట్టింది. మిగిలిన సెర్చ్‌ ఇంజిన్‌లనూ ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంచాలన్న ఐరోపా ఆదేశానికి గూగుల్ తలొగ్గింది. ప్రత్యర్థి సెర్చింజన్లకూ సమాన అవకాశాలు ఇచ్చేందుకు అంగీకరించింది.

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంలో ఏం శోధించాలన్నా.. అందరూ ఆశ్రయించేది గూగుల్‌నే.  ఈ సెర్చ్‌ ఇంజిన్‌ ఆధునిక అంతర్జాల యుగాన్ని అంతలా ఏలేసింది. కానీ గూగుల్‌ ఏకఛత్రాధిపత్యానికి యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కళ్లెం వేసింది. ఆండ్రాయిడ్‌ పరికరాల్లో ప్రత్యర్థి సెర్చ్‌ ఇంజిన్‌లకు సమాన అవకాశాలు ఇవ్వాలంటూ యురోపియన్‌ కమిషన్‌ ఇచ్చిన ఆదేశానికి గూగుల్‌ తలొగ్గింది. ఈ నిర్ణయంతో ఐరోపాలో ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ తన పట్టును కోల్పోనుంది. యూరప్‌లోని ఆండ్రాయిడ్‌ పరికరాల్లో డీఫాల్ట్‌గా మిగిలిన సెర్చ్‌ ఇంజిన్‌లు కూడా ఉచితంగా అందుబాటులో ఉండనున్నాయి. 27 దేశాల ఐరోపా కూటమి తీసుకొచ్చిన నిబంధనలతో గూగుల్‌, అమెజాన్‌, యాపిల్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్రపంచ ప్రజాధరణ పొందిన సంస్థలు తమ ప్రత్యర్థులకు సమాన అవకాశాలు ఇవ్వనున్నాయి.

ప్రపంచంలోని 90 శాతం ఆండ్రాయిడ్‌, స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ సెర్చ్‌ ఇంజినే ఉంది. ఒకప్పుడు వేలం ద్వారా ఆండ్రాయిడ్‌ స్క్రీన్లపై సెర్చ్‌ ఇంజిన్‌లకు స్థానం కల్పించిన గూగుల్‌.. ఇప్పుడు ఉచితంగానే ఆ పని చేస్తామంటూ ప్రకటించింది. యూరప్‌లోని కొత్త ఆండ్రాయిడ్‌ ఫోన్ల స్క్రీన్‌పై కనపడేందుకు సెర్చ్‌ ఇంజిన్‌లు వేలంలో పాల్గొనాల్సి ఉంటుందని 2019లో గూగుల్‌ ప్రకటించింది. వేలంలో పాల్గొన్న కేవలం నాలుగు సెర్చ్‌ ఇంజిన్‌లకు మాత్రమే ఆండ్రాయిడ్‌ స్క్రీన్లపై కనిపించేందుకు గూగుల్ అనుమతిచ్చింది. కానీ ఇప్పుడు యురోపియన్‌ యూనియన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఐదు సెర్చ్‌ ఇంజిన్‌లు ఆండ్రాయిడ్‌ స్క్రీన్‌ పైభాగంలో ఉచితంగా ప్రదర్శితమవుతాయని గూగుల్ తెలిపింది. మరో రెండు సెర్చ్‌ ఇంజిన్‌లు కిందిభాగంలో ఉంటాయని పేర్కొంది. అర్హత గల సెర్చ్‌ ఇంజిన్‌లు ఉచితంగా స్క్రీన్లపై ఉండేలా తుది మార్పులు చేస్తున్నామని, ఫోన్‌ స్క్రీన్‌పై సెర్చ్‌ ప్రొవైడర్ల సంఖ్యను కూడా పెంచుతామని గూగుల్‌ డైరెక్టర్‌ ఆలివర్‌ బెదెల్‌ వెల్లడించారు. ఈ మార్పులు రానున్న సెప్టెంబర్‌ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. 

గూగుల్‌ వేలం ప్రక్రియపై ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్న ప్రత్యర్థి సెర్చ్‌ ఇంజిన్‌ డక్‌డక్‌గో.. ఇది మూడేళ్ల క్రితం చేయాల్సిన పని అని వ్యాఖ్యానించింది. అయితే ఇది అన్ని దేశాల్లో, అన్ని ఫ్లాట్‌ఫాముల్లో ఉండాలని డక్‌డక్‌గో సీఈఓ గాబ్రియేల్‌ పేర్కొన్నారు. సెర్చ్‌ ఇంజిన్‌ ఎకోసియా మరో నాలుగు సెర్చ్‌ ఇంజిన్‌లతో కలిసి గతేదాడి గూగుల్‌పై యురోపియన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. గూగుల్‌ గుత్తాధిపత్యం కారణంగా మిగిలిన సెర్చ్‌ ఇంజిన్‌లు మూతబడకుండా ప్రస్తుత నిర్ణయం దోహదపడుతుందని ఎకోసియా వెల్లడించింది. సెర్చ్‌ ఇంజిన్‌లలో ఏకచత్రాధిపత్యం కోసం గూగుల్‌ అక్రమంగా ఆండ్రాయిడ్‌ను వినియోగించుకున్నందుకు 2018లో గూగుల్‌కు ఐరోపా ట్రస్ట్‌ అథారిటీ 5.16 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని