Bilkis Bano: ఆ దోషులను ఎందుకు విడుదల చేశారో అర్థంకావడం లేదు

2002నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం సహా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన దోషులు జైలు నుంచి విడుదల కావడంపై దుమారం రేగుతోంది......

Published : 17 Aug 2022 01:57 IST

బిల్కిస్‌ బానో దోషుల విడుదలపై మండిపడుతున్న విపక్షాలు

దిల్లీ: 2002నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం సహా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన దోషులు జైలు నుంచి విడుదల కావడంపై దుమారం రేగుతోంది. గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. క్రూరమైన దోషులను ఎలా విడిచిపెట్టారంటూ ఆక్షేపిస్తున్నాయి.  క్షమాభిక్ష ద్వారా రేపిస్టులను విడుదల చేసిన ప్రధాని మోదీ మాతృ రాష్ట్రం గుజరాత్‌ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాయి.

ఆ దోషుల విడుదలపై బిల్కిస్ బానో కుటుంబం సైతం విచారం వ్యక్తం చేసింది. అత్యాచారం, హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 11మందిని గుజరాత్‌ ప్రభుత్వం ఎలా విడుదల చేసిందో అర్థం కావడం లేదంటూ ఆమె భర్త యాకుబ్‌ రసూల్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీవీలో వార్తలు చూసిన తర్వాతే ఈ విషయం మాకు తెలిసిందన్నారు. ‘ఖైదీలు తమ దరఖాస్తును ఎప్పుడు ప్రాసెస్ చేశారో, రాష్ట్ర ప్రభుత్వం ఏ లెక్కన దాన్ని పరిగణనలోకి తీసుకుందో అర్థం కావడం లేదు’ అని రసూల్ తెలిపారు. ‘మా కుమార్తె సహా, ఆ దాడిలో చనిపోయిన వారిని ప్రతిరోజు గుర్తుచేసుకుంటున్నాం. అల్లర్లలో మృతిచెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం’ అని అన్నారు.

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు ప్రత్యేక సీబీఐ కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. కాగా దోషులుగా వారు 15ఏళ్లు కారాగారంలో గడిపారు.

అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్‌ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు వారి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొంటూ గోద్రా సబ్‌ జైలు నుంచి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని