టీకాల కొరత: కేంద్రం కీలక నిర్ణయం!
భారత్లో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.
విదేశీ టీకాల అనుమతి ప్రక్రియ వేగవంతం
దిల్లీ: భారత్లో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీంతో అత్యవసర వినియోగానికి వేగంగా అనుమతులు ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యింది. భారత్లో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరికొద్ది రోజుల్లోనే మరిన్ని టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచ ఆరోగ్యసంస్థ జాబితాలో ఉన్న అమెరికా ఎఫ్డీఏ, ఈఎంఏ, బ్రిటన్ ఎంహెచ్ఆర్ఏ, పీఎండీఏ జపాన్ వంటి విదేశీ ఔషధ నియంత్రణ సంస్థలు ఇప్పటికే ఆయా దేశాల్లో పలు టీకాలకు ఆమోదం తెలిపాయి. ఇలా ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లకు భారత్లో అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్లపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. విదేశాల్లో అనుమతి పొందిన టీకాలను భారత్లో అనుమతించే ముందు.. తొలుత 100మంది లబ్ధిదారులకు ఇచ్చి వాటి భద్రత ఫలితాలపై వారం పాటు విశ్లేషిస్తాము’ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10.85 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. వ్యాక్సిన్ కొరత ఉందని పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవిస్తున్నాయి. దీంతో దేశీయంగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు వివిధ దేశాల్లో అనుమతి పొందిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతించి, కొరతను అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరికొన్ని నెలల్లోనే జాన్సన్ అండ్ జాన్సన్, జైడస్ క్యాడిలా, నోవావాక్స్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన (ముక్కు ద్వారా తీసుకునే) టీకాలు అందుబాటులోకి రానున్నాయి.
విదేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలు భారత్లో అనుమతి పొందాలంటే ఇక్కడే రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో స్పుత్నిక్-వి, నోవావాక్స్ టీకాల ప్రయోగాలు భారత్లో చేపట్టాయి. అందువల్ల ఇవి విదేశాల్లో అనుమతులు పొందినప్పటికీ వాటిని భారత్లో వినియోగించడంలో కొంత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో వీటి ప్రయోగాలు, ఫలితాల విశ్లేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా