
Internet: బహుభాషల్లో ఇంటర్నెట్.. అత్యవసరం: కేంద్రమంత్రి
దిల్లీ: డిజిటల్ ఇండియాను సాకారం చేయడం కోసం భారతీయులందరికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ను బహుభాషల్లో తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భారత్.. డిజిటల్ ఇండియాగా మారాలంటే బహుభాషా ఇంటర్నెట్ అత్యవసరమన్నారు. అయితే, దీని అమలును పెద్ద సవాలుగా భావించట్లేదని చెప్పారు.
బహుభాషా ఇంటర్నెట్పై ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వర్క్షాప్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, మొజిల్లా సహా అనేక ఇంటర్నెట్ ఆధారిత దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాజీవ్ మాట్లాడారు. బహుభాషా ఇంటర్నెట్ను ఆధునిక భారతదేశ చరిత్రలోని విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించారు. ప్రాంతీయ భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగించడాన్ని నూతన విద్యా విధానం ప్రోత్సహిస్తుందని తెలిపారు. కాబట్టి.. ఇంటర్నెట్, టెక్నాలజీ వేదికలు ప్రాంతీయ భాషలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు. బహుభాషల్లో ఇంటర్నెట్ను రూపొందించడమే లక్ష్యంగా కార్యాచరణను ఖరారు చేసేందుకు ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖ పలు పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్ కోట్లాది మంది భారతీయులకు చేరువైంది. కానీ, అందులోని కంటెంట్ మొత్తం ఇంగ్లిష్లో ఉండటంతో ఇంకా చాలా మందికి అందుబాటులోకి రాలేదు. అయితే, బహుభాషా ఇంటర్నెట్ ద్వారా 40కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులను డిజిటల్ ఇండియాలో భాగం చేయొచ్చు’’అని తెలిపారు.