వాహనదారులకు గుడ్న్యూస్.. గడువు పొడిగింపు
కొవిడ్ వేళ వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించే కబురు చెప్పింది. మోటార్ వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇతర పర్మిట్లకు.
దిల్లీ: కొవిడ్ వేళ వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించే కబురు చెప్పింది. మోటార్ వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇతర పర్మిట్లకు సంబంధించిన పత్రాల గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2020 ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొవిడ్ వేళ వాహనదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. ఇప్పటికే పలుమార్లు ధ్రువపత్రాల గడువును కేంద్రం పొడిగిస్తూ వస్తోంది. చివరగా ఈ ఏడాది మార్చి 26న సైతం ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చింది.
దేశమంతటా ‘పొల్యూషన్’ ఒకే తరహాలో...
పొల్యూషన్ సర్టిఫికెట్ (పీయూసీ- పొల్యూషన్ అండర్ కంట్రోల్) జారీ విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఏకరీతిన పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే, పీయూసీ డేటాను జాతీయ రిజిస్టర్తో అనుసంధానం చేస్తూ నోటిఫికేషన్ వెలువరించింది. ఇకపై అందజేసే పొల్యూషన్ సర్టిఫికెట్పై వాహనం నంబర్, యజమాని పేరు, అతడి ఫోన్ నంబర్, ఇంజిన్ నంబర్, చాసిస్ నంబర్, ఉద్గార స్థితి తదితర వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ముద్రించనున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్కు మొబైల్ నంబర్ను తప్పనిసరి చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై నిర్దేశించిన ప్రమాణాల కంటే ఎక్కువ ఉద్గారాలు విడుదలవుతున్నట్లేతే రిజక్షన్ స్లిప్ను కూడా అందించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.