Air India: ఎయిరిండియాపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: పీయూష్‌

ఎయిరిండియా విక్రయం వ్యవహారంలో వస్తున్న వార్తలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ప్రస్తుతం దుబాయి పర్యటనలో.......

Updated : 03 Oct 2021 11:31 IST

దుబాయి: ఎయిరిండియా విక్రయం వ్యవహారంలో వస్తున్న వార్తలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న ఆయన ఎయిరిండియాపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. ఎయిరిండియా కొత్త యజమాని ఎవరనే అంశంపై జరగాల్సిన ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసి తుది ఎంపిక జరుగుతుందన్నారు. టాటాసన్స్‌ చేతికి ఎయిరిండియా అప్పగించినట్టు నిన్న మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన్ను విలేకర్లు ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను దుబాయిలో ఉన్నాననీ.. అలాంటి నిర్ణయం జరిగిందని తాను అనుకోవడంలేదన్నారు. ఎయిరిండియా విక్రయానికి సంబంధించి బిడ్‌లు ఆహ్వానించినప్పటికీ.. వాటన్నింటినీ అధికారులు పూర్తిగా అంచనా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది విజేతను ఎంపిక చేస్తుందన్నారు.

రుణాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కొనుగోలుకు సంబంధించి టాటా సన్స్‌ అధిక మొత్తానికి బిడ్‌ వేయడంతో ఆ సంస్థను కొత్త యజమానికిగా నిర్ణయించినట్టు నిన్న పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై అటు ఎయిరిండియా గానీ, టాటా గ్రూపు గానీ స్పందించనప్పటికీ దీపమ్‌ కార్యదర్శి ట్వీట్‌ చేశారు. ‘ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు తప్పకుండా వెల్లడిస్తుంద’ని కేంద్ర పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (దీపమ్‌) విభాగం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే స్పష్టంచేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని