Corona: కోలుకున్న 9 నెలల తర్వాత టీకా

కరోనా సోకిన వారు వైరస్‌ నుంచి కోలుకున్న తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ ప్యానెల్‌ నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సిఫార్సు

Updated : 18 May 2021 15:19 IST

సిఫార్సు చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్‌

దిల్లీ: కరోనా సోకిన వారు వైరస్‌ నుంచి కోలుకున్న తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ ప్యానెల్‌ నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సిఫార్సు చేస్తోంది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించిన ఈ ప్యానెల్‌.. ఇప్పుడు దాన్ని తొమ్మిది నెలలకు పెంచింది. తాజా ప్రతిపాదనలను ప్యానెల్‌ కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత ప్రొటోకాల్‌ ప్రకారం.. కరోనా బారినపడ్డవారు.. కోలుకున్నాక 4-8 వారాల తర్వాత కొవిడ్‌ టీకా తీసుకోవచ్చు. అయితే ఈ వ్యవధి పెరిగితే శరీరంలో యాండీబాడీలు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయని ఎన్‌టీఏజీఐ చెబుతోంది. ‘‘కరోనా సోకి కోలుకున్నవారు తొలి డోసు టీకా కోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉంటే మంచింది. తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకున్నట్లయితే అది శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది’’ అని ప్యానెల్‌ వివరించింది. ఇదిలా ఉండగా.. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఆరు నెలలకు తొలి డోసు టీకా తీసుకుంటే మంచిదని డబ్ల్యూహెచ్‌వో కూడా చెబుతోంది. 

వ్యాక్సినేషన్‌ విధానంపై ఎన్‌టీఏజీఐ ఇటీవల కొన్ని సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే. బాలింతలు, గర్భిణీలు టీకా తీసుకోవచ్చని స్పష్టం చేసిన ప్యానెల్‌.. మొదటి డోసు తీసుకున్నాక కరోనా బారినపడితే.. కోలుకున్నాక 4-8 వారాలు వేచి ఉండి, తర్వాత రెండు డోసు వేయించుకోవచ్చని తెలిపింది. ప్లాస్మా చికిత్స చేయించుకున్నవారైతే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక మూడు నెలలకు వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించింది. ఇక కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఈ ప్యానెల్‌ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని