MGNREGA: ఉపాధి హామీ పథకంలో అవకతవకలు.. అమలు కఠినతరం!

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పథకం అమలులో గత రెండేళ్లలో విపరీతమైన అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది.

Published : 14 Feb 2022 01:00 IST

బడ్జెట్‌ కేటాయింపులో 25శాతం కోతపెట్టిన కేంద్రం

దిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో గత రెండేళ్లలో విపరీతమైన అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే వీటి అమలు కఠినతరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం.. ఈ పథకానికి బడ్జెట్‌ నిధుల్లో భారీగా కోత పెట్టింది. సవరించిన అంచనా కంటే దాదాపు రూ.25వేల కోట్లను తగ్గించింది.

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2022-23గాను రూ.73వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా వ్యయం రూ.98 వేల కోట్ల కంటే ఇది 25 శాతం తక్కువ. అయితే, గత రెండేళ్లుగా బడ్జెట్‌ అంచనాల కంటే సవరించిన అంచనా వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఈ సమయంలో పథకం అమలులో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా లబ్ధిదారుల పేరుతో మధ్యవర్తులు ఈ నగదును తీసుకుంటున్నట్లు తేలింది.

డీబీటీ పద్ధతిలో లబ్ధిదారులకే నేరుగా నగదు బదిలీ జరుగుతున్నప్పటికీ వ్యవస్థలో కొంత మానవ ప్రమేయం ఉంది. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పేరు నమోదు చేస్తామని మధ్యవర్తులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బ్యాంకులో నగదు జమ అయిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలంటూ చెబుతున్నారు. ఇది భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ విధంగా అసలు పని జరగకుండానే మధ్యవర్తుల చేతిలోకి నగదు వెళ్తోంది. ఇటువంటి ప్రలోభాల వల్ల భారీస్థాయిలో డబ్బు వృథా అవుతోంది’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. అందుకే ఇటువంటి వాటిని తగ్గించేందుకు పథకం అమలు కఠినతరం చేస్తున్నట్లు వెల్లడించాయి.

అంతేకాకుండా గత రెండేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని అన్నారు. 2020-21 ఏడాదిలో రూ.1.11 లక్షల కోట్లు ఖర్చుపెట్టగా, ఇది బడ్జెట్‌ అంచనాల కంటే దాదాపు రూ.61 వేల కోట్ల అధికం. అదే 2014-15లో ఈ వ్యయం రూ.35 వేల కోట్లుగా ఉందని ఓ కీలక అధికారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని