Morbi Bridge Collapse: ఆ పరిహారం సరిపోదు.. మోర్బీ ఘటనపై గుజరాత్‌ హైకోర్టు వ్యాఖ్యలు!

మోర్బీ ఘటనలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారం చాలా తక్కువని గుజరాత్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిహారాన్ని రెండింతలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Updated : 24 Nov 2022 17:38 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనలో బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై గుజరాత్ హైకోర్టు అంసతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువని వ్యాఖ్యానించింది. తీవ్రంగా గాయపడిన వారికి కూడా అతి తక్కువ పరిహారాన్ని ప్రకటించడాన్ని తప్పుబట్టింది. మోర్బీ ఘటన కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

‘‘బాధితులకు, వారి కుటుంబీలకు మీరు అందించే పరిహారం వాస్తవికంగా ఉండాలి. ఈ సమయంలో వారికి గౌరవప్రదమైన పరిహారం అందించడం ఎంతో అవసరం. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు నెలకు ₹ 3,000 సాయం చాలా తక్కువ. అవి వారి దుస్తులు, పుస్తకాలకే సరిపోవు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోగా, 12 మంది పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు మరణించారు. వీరికి ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పరిహారాన్ని రెండింతలు చేయాలి లేదా ఒక్కొక్కరికి కనీసం ₹ 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

బాధితులకు అందించే పరిహారానికి సంబంధించి వివరణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిహారం అందించేందుకు అనుసరిస్తున్న విధివిధానాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది.  దాంతోపాటు రాష్ట్రంలోని బ్రిడ్జిల పరిస్థితిపై సర్వే నిర్వహించి, ఆ నివేదికను ధర్మాసనం ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై ఉన్న తీగెల వంతెన అక్టోబరు 30 కూలిపోయింది. ఈ ఘటనలో 135 మందికి పైగా మృతి చెందగా.. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటీష్‌ కాలంనాటి ఈ బ్రిడ్జ్‌ మరమ్మత్తుల బాధ్యతను అర్హతలేని సంస్థకు ఇవ్వడంతోపాటు, ఆ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే బ్రిడ్జ్‌ కూలిపోయినట్లు విచారణలో తేల్చారు. అంతేకాకుండా బ్రిడ్జ్‌పై కొత్తగా నిర్మించిన మెటల్‌ ఫ్లోరింగ్‌ కారణంగా అదనపు భారం పడటంతో బ్రిడ్జ్‌ కూలిపోయిందని ఫోర్సెనిక్‌ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 9 మందిని గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని