Gujarat - Supreme Court: 40 మంది జడ్జీల పదోన్నతులు రద్దు

గుజరాత్‌లో వివాదానికి దారితీసిన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవహారంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Updated : 17 May 2023 11:37 IST

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గుజరాత్‌ హైకోర్టు నిర్ణయం

దిల్లీ/అహ్మదాబాద్‌: గుజరాత్‌లో వివాదానికి దారితీసిన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవహారంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 68 మంది జడ్జీలకు ఇచ్చిన పదోన్నతుల్లో 40 మంది పదోన్నతులను రద్దు చేసింది. మరో 21 మందికిచ్చిన పదోన్నతులను కొనసాగిస్తూనే వారికి స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు సోమవారం రెండు నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. మిగతా ఏడుగురు జడ్జీల విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ నెల 12న జస్టిస్‌ ఎం.ఆర్‌.షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ప్రక్రియపై నిలుపుదల(స్టే) ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్‌ముఖ్‌భాయ్‌ వర్మకు ఇచ్చిన పదోన్నతిని హైకోర్టు కొనసాగించింది. అయితే, తొలుత ఆయనకు రాజ్‌కోట్‌లోని 16వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా పోస్టింగ్‌ ఇవ్వగా ఇప్పుడు 12వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా నియమించింది.

జులైలో విచారణ చేపడతాం: సుప్రీంకోర్టు

గుజరాత్‌లో వివాదాస్పదమైన దిగువ కోర్టు జడ్జీల పదోన్నతుల వ్యవహారంపై జులైలో విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. వేసవి సెలవుల తర్వాత ఈ అంశాన్ని చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రతిభ-సీనియారిటీ ఆధారంగానే పదోన్నతి కల్పించాలన్న సర్వీసు నిబంధనలను గుజరాత్‌ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంటూ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 12న స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమోషన్లు పొందిన వారంతా తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని ఆదేశించింది. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా సోమవారం పదవీ విరమణ చేశారు. అయితే, పదోన్నతుల వ్యవహారంలో తమ తప్పిదమేమీ లేకున్నా అవమానాలకు గురికావాల్సి వచ్చిందంటూ కొందరు జడ్జీలు మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును జులైలో విచారణకు చేపడతామని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని